టీడీపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి రావెల్ కిశోర్ బాబు పుత్రరత్నం రావెల సుశీల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడా? అంటే, అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. మద్యం మత్తు తలకెక్కిన నేపథ్యంలో ఓ వివాహిత చేయి పట్టుకుని కారులోకి లాగేందుకు యత్నించిన ఘటనలో రావెల సుశీల్ తో పాటు అతడి కారు డ్రైవర్ రమేశ్ పై బంజారాహిల్స్ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం నాడు జరిగిన ఈ ఘటనకు సంబంధించి కాస్త ఆలస్యంగా స్పందించిన పోలీసులు నేటి ఉదయం మినిస్టర్ క్వార్టర్స్ లోని రావెల ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు.
ఈ క్రమంలో వేగంగా చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలించిన సుశీల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. సుశీల్ ఆచూకీ లభించని నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు హైదారాబాదు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ కేసులో ఏ ఒక్కరిని తప్పించే యత్నం చేయలేదని ప్రకటించిన డీసీపీ… సుశీల్ ను తప్పనిసరిగా అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఇక ఉన్నతాధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు రావెల సుశీల్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.
ఈ ఘటనలో రాజకీయ ప్రమేయమేమీ లేదని కూడా డీసీపీ చెప్పారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే సుశీల్ పై కేసు నమోదులో కాస్తంత జాప్యం జరిగిందన్నారు. సుశీల్, అతడి కారు డ్రైవర్ పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. సుశీల్ డ్రైవర్ పేరు అప్పారావుగా ప్రసారమైందన్న ఆయన అతడి పేరు అప్పారావు కాదని, రమేశ్ అని తెలిపారు. సుశీల్ ను అరెస్ట్ చేస్తామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఇక ఈ కేసులో సుశీల్ దోషిగా తేలితే అతడికి ఏడేళ్ల జైలు శిక్ష తప్పదని కూడా డీసీపీ చెప్పారు.





