జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత టీ-టీడీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి క్యూ కట్టడంపై తెలంగాణా తెలుగుదేశం శాసనసభా పక్ష నేత రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే బాధగా ఉందని, ముఖ్యంగా టీఆర్ఎస్ చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే మనుషులపై నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తపరిచారు.
“జంతువులకు ఉన్న విశ్వాసం కూడా ఎమ్మెల్యేలకు లేకపోవడం సిగ్గు చేటుగా అభివర్ణించిన రేవంత్, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను చూస్తుంటే అసహ్యం వేస్తోందని” అసహనం వ్యక్తం చేశారు. కష్టాలు వచ్చినప్పుడు నిలబడి కలబడిన వాడే మగాడని, సీఎం మనవడు గోళీలు ఆడుకునేందుకు తెలంగాణ సచివాలయం వేదికగా మారిందని విమర్శించారు.
ఇవాళ కేసీఆర్ కు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలందరూ రేపు హరీశ్ రావుకు అమ్ముడుపోయే అవకాశం ఉందని, కేసీఆర్ ఆడుతున్న రాజకీయ క్రీడలో చివరికి ఆయనే బలవ్వక తప్పదని జోస్యం చెప్పారు. 2019 ఎన్నికల నాటికి 100 నియోజకవర్గాల్లో కొత్త వారిని తీసుకొస్తామన్న రేవంత్, 50 శాతం సీట్లను బీసీలకే ఇస్తామని ప్రకటించారు.



