ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు. అప్పటి నుంచి ఆమె ప్రతీరోజు వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం తప్ప మరేమీ చేయలేకపోయారు.
సొంత అన్నపై ఆమె విమర్శలు చేస్తుంటే, ప్రజలకు అది విచిత్రంగా అనిపిస్తుంది కనుక మొదట్లో ఆసక్తిగా గమనించారు. కానీ అదొక డైలీ తెలుగు సీరియల్లా సాగిపోతుండటంతో ప్రజలకు ఆమె పట్ల ఆసక్తి కోల్పోయారు. ఇది జగన్ అదృష్టమనే చెప్పాలి.
అయితే ఆమె కనీసం వైసీపీ ముఖ్య నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షించగలిగి ఉన్నా ఏపీలో కాంగ్రెస్ పార్టీ బ్రతికి బట్ట కట్టేది. కానీ ఒక్కరినీ ఆకర్షించలేకపోగా 2024 ఎన్నికలో ఆమెతో సహా పోటీ చేసినవారందరూ ఓడిపోయారు. దీంతో ఏపీ కాంగ్రెస్ పార్టీ కథ మళ్ళీ మొదటికొచ్చింది.
అప్పటి నుంచి అడపా దడపా షర్మిల చేసే విమర్శలు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనపడదు… ఆ పార్టీ నేతలు కనపడరు.
ఇలాంటి పరిస్థితిలో ఉన్న పార్టీకి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఏఐసీసీ కార్యదర్శి, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ పీవీ మోహన్ నియమితులయ్యారు.
రాష్ట్ర రాజకీయాలపై, ముఖ్యంగా వైసీపీ గురించి పూర్తి అవగాహన ఉన్న వైఎస్ షర్మిలే ఏమీ చేయలేక చేతులేత్తేసినప్పుడు కర్ణాటకకు చెందిన ఎమ్మెల్సీ పీవీ మోహన్ వచ్చి ఏం సాధించగలరు? ఏమీ చేయలేనప్పుడు ఈ నియామకాలు దేనికి?అంటే ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్లతో బాటు ఆయనని నియమించారు అంతే. కనుక ఏపీ కాంగ్రెస్ ఈవిధంగా రాజకీయ ఉద్యోగ కల్పనకైనా ఉపయోగపడుతున్నందుకు సంతోషించాల్సిందే.





