‘రోను’ ఉగ్రరూపం… విశాఖ అతలాకుతలం..!

roanu floodsబంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం కారణంగా రంగప్రవేశం చేసిన ‘రోను’ తుఫాన్ నేడు మరింత ఉగ్రరూపం దాల్చనుంది. విశాఖకు 110, తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు 60 కిలో మీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో తీర ప్రాంతంలో గంటకు 90 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఏపీలోని అన్ని ఓడరేవుల్లో నాలుగో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి.

ADVERTISEMENT

తుఫాన్ ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావం కృష్ణాజిల్లా వరకూ విస్తరించింది. తుఫాన్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల కింద ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏపీ సర్కారు రంగంలోకి దింపింది. ఏపీ పరిధిలో నేడు తీవ్ర రూపం దాల్చనున్న రోను తుఫాన్ నేటి సాయంత్రానికి ఒడిశా వైపు వెళ్లనుంది. శనివారం అర్ధరాత్రి బంగ్లాదేశ్ లో తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

‘రోను’ ఎంట్రీ ఇవ్వకముందే విశాఖ నుంచి అండమాన్ బయలుదేరి వెళ్లాల్సిన ప్రయాణికుల నౌక స్వరాజ్ దీప్ నీటిలోనే నిలిచిపోయింది. అప్పటికే నౌక ఎక్కేసిన 1,218 మంది ప్రయాణికులు ఇటు నౌక దిగలేక, అటు ముందుకు సాగలేక నౌకలోనే చిక్కుకుపోయారు. దీనిపై సమాచారం అందుకున్న ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరాలు నౌకలోని ప్రయాణికులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి విశాఖ జిల్లా పర్యటన రద్దయింది. ఈ నెల 21న సీఎం పూడిమడకలో పర్యటించాల్సి ఉంది. 22వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించడంతో కార్యక్రమం వాయిదా వేసినట్టు కలెక్టర్ యువరాజ్ వెల్లడించారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి, ఎలాంటి సాయం కోసమైనా, ఇతరత్రా సమాచారం కోసం 1800 425 0001, 0891 2549749 నంబర్లకు కాల్ చేయవచ్చని అధికారులు ప్రకటించారు.

ADVERTISEMENT
Latest Stories