రాజకీయ రంగు పులుముకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో సూసైడ్ చేసుకున్న రోహిత్ ఆత్మహత్యకు తాను కారణం కాదని ఏబీవీపీ విద్యార్థి నేత సుశీల్కుమార్ చెబుతున్నాడు. యాకూబ్మెమన్ ఉరి తర్వాత ఏఎస్ఏ విద్యార్ధులు యూనివర్శిటీలో భారీ ర్యాలీ తీసి నమాజ్ చేశారని, ఆ ర్యాలీలో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారని వెల్లడించాడు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణించినప్పుడు తాము నిర్వహించిన ర్యాలీలో ఎవరూ పాల్గొనలేదన్నాడు.
యాకూబ్మెమన్ను ఉరి తీసిన తర్వాత హెచ్సీయూలో తీసిన ర్యాలీ ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్చేసి ఏఎస్ఏ గూన్స్ అని తాను రాశానని, ఆ తర్వాత రాత్రి ఏఎస్ఏ గూండాలు నాపై దాడికి పాల్పడ్డారని చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఆస్పత్రిలో వారం రోజుల పాటు చికిత్స పొందానని, వారు చేసిన దాడి వల్లే తనకు ‘అపెండిసైటిస్’ ఆపరేషన్ జరిగిందని తెలిపాడు. తనపై జరిగిన దాడిని ఎవరూ పట్టించుకోలేదని, పార్టీలు రాజకీయాలు చేసేందుకే విద్యార్ధులను వాడుకుంటున్నాయని విమర్శించాడు.
రోహిత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, చాలా ధైర్యవంతుడు, ఆత్మహత్య వెనుక ఏవో కారణాలు ఉన్నాయని, వీటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని సుశీల్కుమార్ కోరాడు. తనపై దాడి జరిగిన తర్వాతే హైకోర్టుకు వెళ్లానని, తనపై దాడి జరిగినా వీసీ స్పందించలేదన్నాడు. కృష్ణ చైతన్య అనే విద్యార్ధి యూనివర్సిటీ కమిటీకి ఫిర్యాదు చేశారని, దీంతో రోహిత్తో పాటు మరో నలుగురిపై సస్పెన్షన్ వేటు పడిందని చెప్పాడు.
యూనివర్సిటీకి వచ్చి వీసీని అడిగే సమయంలో ఏఎస్ఏ విద్యార్థులు తన అమ్మను దూషించారన్నాడు. బీజేపీ నేతలెవరూ తమకు మద్దతివ్వలేదని, నా ఫిర్యాదు తర్వాతే కేంద్రమంత్రి దత్తాత్రేయ.. యూనివర్సిటీలో జరుగుతున్న పరిస్థితులపై హెచ్ఆర్డీకి లేఖ రాశారని స్పష్టం చేశాడు.





