విజయంలో కూడా వ్యత్యాసాలు ఉంటాయి కదా! ప్రత్యర్ధులు రెండూ పోటాపోటీగా ఉంటే వీక్షించే వారికి కన్నుల పండుగే! అలా కాక ‘వార్ వన్ సైడ్’ అయితే కొంతమందికి మాత్రమే సంతోషం. అయితే నేడు రాయల్ ఛాలెంజర్స్ గెలిచిన తీరుకు మాత్రం అందరూ ఫిదా అవుతున్నారు. ఒక టీ 20 మ్యాచ్ లో ఏకంగా 144 పరుగుల విజయం సాధించడం అనేది మరీ అరాచకంగానే భావించాలి.
డివిలియర్స్ 52 బంతుల్లో 12 సిక్సర్లు, 10 ఫోర్లతో అజేయమైన 129 పరుగులు, కోహ్లి 55 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 109 పరుగులు చేయడంతో ఏకంగా 20 ఓవర్లలో 248 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. దీంతో లక్ష్య చేధనకు ముందే మ్యాచ్ లో గెలుపు ఖరారైనప్పటికీ, గుజరాత్ పోరాటం ఎక్కడిదాకానో అన్న ఆసక్తి నెలకొంది. అయితే దానికి కూడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కేవలం 104 పరుగులకే గుజరాత్ ను మట్టికరిపించి మిగతా జట్లకు డేంజర్ సిగ్నల్స్ అందించింది బెంగుళూరు జట్టు.
144 పరుగుల భారీ తేడాతో గెలుపొందడంతో మిగతా అన్ని జట్ల కంటే మెరుగైన రన్ రేట్ సాధించగా, మరో వైపు గుజరాత్ మాత్రం రన్ రేట్ లో ముంబై కంటే వెనుకబడింది. దీంతో చివరి నిముషం సంచలనాలకు తెరలేపింది ఈ మ్యాచ్ ఫలితం. ప్లే ఆఫ్స్ రేస్ లో బరిలో నుండి పూణే, పంజాబ్ జట్లు తప్పుకోవడంతో మిగిలిన 4 స్థానాల కోసం 6 జట్లు పోటీ పడుతున్నాయి. ఇందులో ముంబై, బెంగుళూరు జట్లు 5, 6 స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే కోల్ కతా, పంజాబ్, ఢిల్లీ జట్లతో జరిగే మ్యాచ్ లలో విజయం సాధిస్తే… అన్ని జట్ల కంటే మెరుగైన రన్ రేట్ తో బెంగుళూరు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ కు చేరుతుంది.





