వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఈరోజు ఢిల్లీలో ప్రెస్మీట్ పెట్టి తన తండ్రి హత్యకు వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డే అని వారిద్దరినీ జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారని నేరుగా తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు… హంతకులు ఎక్కడో లేరు మన మద్యనే ఉన్నారు. హత్యా రాజకీయాలు చేసే వైసీపికి ఎవరూ ఓట్లు వేయవద్దని సునీతారెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఊహించిన దాని కంటే చాలా వేగంగానే, వైసీపి తరపున సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, “ఇన్నాళ్ళకు సునీతారెడ్డి తన ముసుగును తీసేసి తన అసలు రూపం బయటపెట్టుకున్నందుకు ముందుగా ఆమెకు చాలా థాంక్స్ చెపుతున్నాను.
ఇన్నేళ్ళుగా మాట్లాడని ఆమె ఎన్నికలకు ముందు ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రెస్మీట్ పెట్టి తన తండ్రి హత్య కేసు గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని, మా ఎంపీ అవినాష్ రెడ్డిని నిందిస్తున్నారు. మా పార్టీని ఎన్నికలలో దెబ్బ తీసేందుకు చంద్రబాబు నాయుడే ఆమెను ప్రోత్సహించి ఢిల్లీలో ఈ ప్రెస్మీట్ పెట్టించి మాకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు.
ఆమె తన తండ్రిని హత్య చేసిన వారితోనే చేతులు కలపడం చాలా దారుణం. ఆమె వారితో కలిసి ఎన్నికలలో పోటీ చేయాలని అనుకుంటున్నట్లున్నారు. చాలా మంచిది. అప్పుడు ప్రజలే వివేకా హత్య కేసులో తీర్పు చెపుతారు. ఆమె రాజకీయ దురుదేశ్యంతోనే మమ్మల్ని వేలెత్తి చూపుతున్నారని అర్దమవుతూనే ఉంది.
ఈ హత్య కేసుని వారం రోజులలో తేల్చేయవచ్చని ఆమె స్వయంగా చెప్పారు కనుక అప్పుడే ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుని ఎందుకు అడగలేదు? వివేకా హత్య జరిగిన తర్వాత దాదాపు రెండు నెలలు పైగా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా?అప్పుడే కేసుపై దర్యాప్తు జరిపించి దోషులను ఎందుకు పట్టుకోలేదు?” అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
అయితే ఈ ప్రశ్నలన్నిటికీ చాలా ఎదురు ప్రశ్నలున్నాయి. వాటన్నిటికీ సజ్జల రామకృష్ణా రెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
వివేకాని టిడిపి నేతలే హత్య చేసిన్నట్లయితే, ఎన్నికల సమయంలో అదే విషయం చాటింపు వేసుకొంటే వైసీపికే లబ్ధి కలిగేది కదా?కానీ గుండెపోటుతో చనిపోయారని ఎందుకు అబద్దం చెప్పారు? హత్య జరిగిన్నట్లు తెలియకుండా బ్యాండేజీలు ఎందుకు చుట్టారు?ఎవరు చుట్టారు?
పోస్ట్ మార్టం నిర్వహించకుండా అంత్యక్రియలు నిర్వహించడానికి ఎందుకు ప్రయత్నించారు? టిడిపి నేతలే ఈ హత్య చేసిన్నట్లయితే రాష్ట్రంలో వైసీపియే అధికారంలో ఉంది కదా? మొదట ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసుల వద్ద ఉన్న సాక్ష్యధారాలన్నిటినీ సీబీఐకి సమర్పించి టిడిపి నేతలను లోపల వేయించేయొచ్చు కదా? కానీ వివేకా హత్య కేసు ముందుకు సాగనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?చెపితే బాగుంటుంది.




