సోము వీర్రాజు…. రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత. టీడీపీ బీజేపీ పొత్తు విచ్ఛిన్నం కావడంతో తన వంతుపాత్ర పోషించారు. ఇప్పుడు టీడీపీని అంతమొందించాలని ఉబలాటపడుతున్నారు. ఈరోజు ఆయన మీడియాతో కాసేపు పిచ్చాపాటిగా మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ చితికి పోతేనే బీజేపీ ఎదుగుతుందని వ్యాఖ్యానించారు. గత వారంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై రామ్ మాధవ్, కన్నా లక్ష్మీనారాయణలు చేసిన వ్యాఖ్యలను తగ్గించి చూపే ప్రయత్నం చేశారు ఆయన.
రాష్ట్రప్రభుత్వం పై రామ్ మాధవ్ వ్యాఖ్యలను ప్రత్యేకంగా చూడాల్సిన పనిలేదన్నారు. రామ్ మాధవ్, కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు అంశాల ఆధారంగా చేసినవేనన్నారు అని వాటిని తేలిక చేసే ప్రయత్నం చేశారు. తాము ఎదగాలంటే ఎవరినైనా తిట్టాల్సిందేనన్నారు. బీజేపీలో ఇప్పుడు ఏ గ్రూప్లూ లేవని.. ఉన్నది ఒకటే గ్రూప్ అని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఎదుగుదల కోసం తిట్టడమే గానీ తమ విమర్శలలో పసలేదని సోము వీర్రాజు చెప్పదలిచారా?
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సోము వీర్రాజు అనుకూలంగా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అని ఎవరైనా ఆరోపిస్తే కాదని అనగలరా? సోము వీర్రాజు తనువు బీజేపీలో మనసు వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉంటుందని చాలామంది బీజేపీ వారే తరచు విమర్శించడం ఇక్కడ గమనార్హం. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పటడుగులు వేస్తోందని, ఈ ప్రభుత్వం వల్ల మేలు జరగకపోగా కీడే ఎక్కువగా జరుగుతోందనే భయం కలుగుతోందని రామ్ మాధవ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.



