డిసెంబర్ 9… కాంగ్రెస్ పార్టీ వారికి సంబంధించి వారి అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజే. కానీ, తెలుగు ప్రజలకు సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ‘విభజన’కు బీజం పడ్డ రోజు. మరో విధంగా చెప్పాలంటే… చావు, బ్రతుకుల మధ్య పయనిస్తున్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి కారణమైన రోజు. 2009, డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ‘ప్రత్యేక తెలంగాణా’ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని, అప్పటి యూపీఏ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
దీంతో సీమాంధ్ర ప్రాంతంలో దీక్షలు, రాస్తారోకోలు, రాజీనామాలు మొదలయ్యాయి. అప్పట్లో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సృష్టించిన హంగామా తెలియనిది కాదు. అలా మరికొద్ది రోజులకు విభజన ప్రకటన పై కేంద్రం వెనక్కి తగ్గినట్లుగా చిదంబరం చేత మరో ప్రకటన చేయించింది. మళ్ళీ తెలంగాణాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో శ్రీకృష్ణ కమిటీ పేరుతో రెండేళ్ళ పాటు తాత్సారం చేసిన కేంద్రం… అంతిమంగా 2013 జూన్ 30వ తేదీన ఏఐసీసీ నుండి రాష్ట్ర విభజన ప్రకటన వచ్చింది.
ఇక, అప్పటినుండి మొదలైన విభజన ప్రక్రియలో ఎన్నో ట్విస్టులు… కాసేపు ప్రత్యేక తెలంగాణా అని, మరికాసేపు రాయల తెలంగాణా అని… ఇంకాసేపు హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అని… ఇలా తెలుగు ప్రజలందరికీ నిద్ర పట్టనివ్వకుండా చేయడంలో సోనియా గాంధీ పోషించిన పాత్ర అనిర్వచనీయం… అమోఘం. అయితే ఎట్టకేలకు 2014 ఫిబ్రవరిలో హైదరాబాద్ తో కూడిన తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ విభజన తంతును ముగించి పార్లమెంట్ లో బిల్లును ఆమోదింప చేసుకుంది.
ఇక, అప్పటినుండి మొదలైన అవశేష ఆంధ్రప్రదేశ్ కష్టాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలన్నా, ఏ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలన్నా ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించడానికి జీతాలు లేవు, ప్రైవేటు ఉద్యోగాలకు అవకాశాలు లేవు. పెట్టుబడులను రాబట్టడానికి ప్రత్యేక హోదా లేదు, పెట్టుబడులతో సంబంధం లేకుండా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్యాకేజి లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుత ఏపీ గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఉన్నదల్లా ఒకే ఒక్క ఆశ… హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడంతో… ఏపీ రాజధాని అమరావతిని కూడా ఆ విధంగా అభివృద్ధి చేస్తారనే నమ్మకం.
అలా తెలుగు వారి భవిష్యత్తును కాలరాసిన రోజుగా డిసెంబర్ 9వ తేదీ ఎప్పుడూ తెలుగు ప్రజల మదిలో గుర్తుండి పోతుంది. ముఖ్యంగా సీమాంధ్ర ప్రజల్లో డిసెంబర్ 9 అంటే… పల్లెల్లో సహజంగా వినపడే “బూతు పురాణపు” మాటలు అందరి దగ్గరి నుంచి వచ్చేస్తాయి. ఎవరి మీదన్నది… ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో..!





