కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు నేషనల్ హెరాల్డ్ కేసులో చుక్కెదురైంది. ఢిల్లీ హైకోర్టులో వీళ్లు పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు విచారణ జరుపుతున్న పాటియాలా హౌజ్ కోర్టు ముందు సోనియా, రాహుల్ హాజరు కావాల్సిందే అని హైకోర్టు స్పష్టం చేసింది.
నేషనల్ హెరాల్డ్ పత్రికను యంగ్ ఇండియన్ లిమిటెడ్ కంపెనీ చేజిక్కించుకున్న వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిని విచారణలో భాగంగా కోర్టుకు హాజరు కావాలని పాటియాలా కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కోర్టు ఆదేశాలపై సోనియా, రాహుల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే పాటియాలా కోర్టు ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. అంతేకాదు, మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలన్న కాంగ్రెస్ నేతల పిటిషన్ ను కూడా హైకోర్ట్ న్యాయమూర్తి కొట్టివేసారు. దీంతో మెట్రో పాలిటన్ కోర్టులో జరగనున్న ఈ కేసు విచారణకు సోనియా, రాహుల్ ఇద్దరూ హాజరు కావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, జవహార్ లాల్ నెహ్రూ ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన విలువైన ఆస్తులను కాజేశారన్న ఆరోపణలతో, బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి పిటిషన్ మేరకు కాంగ్రెస్ నేతలపై చీటింగ్ కేసు నమోదైంది. అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.





