హీరో తనయుడు హీరో… దర్శకుడి తనయులు దర్శకుల బాట పట్టడం సినీ ఇండస్ట్రీలో సర్వ సాధారణమే. ఇక, టాలీవుడ్ విషయాన్ని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరి అలాంటి తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర సినీ దర్శకుడిగా కొనసాగుతున్న రాజమౌళి తనయుడు కార్తీకేయ దర్శకుడిగా అడుగు పెడతారనుకున్న సమయంలో… తన సన్నిహితుడు పృధ్వీతో కలిసి ‘సర్క్యూట్’ అనే రెస్టారెంట్ ను ప్రారంభించడం విశేషం.
‘రొయ్యల బిర్యానీ, రవ్వ దోసను తప్పనిసరిగా రుచి చూడాలంటూ…’ శోభు యార్లగడ్డ చేసిన ట్వీట్ కు ప్రతిగా స్పందించిన కార్తీకేయ… కృతజ్ఞతలు తెలుపుతూ, మీ అభిమాన వంటకాల కోసం వస్తూనే ఉండండి… అన్నారు. దీంతో రాజమౌళి తనయుడు సినీ ఇండస్ట్రీ వైపు కాకుండా వ్యాపారం వైపుకు అడుగులు వేయడం అనేది…. వారసత్వాన్ని ప్రోత్సహించకూడదు అన్న తండ్రి అభీష్టం మేరకు జరిగిందా? లేక తన ఇష్టప్రకారం తీసుకున్న నిర్ణయమా? అదీ గాక కేవలం తన సన్నిహితుడితో కలిసి భాగస్వామ్యం మేరకే ఉన్నారా? అన్నది తెలియాల్సి ఉంది.
కార్తీకేయ సినీ రంగంలో ఇప్పటికే కీలక పాత్ర పోషించారు. ‘బాహుబలి’ సినిమాకు గానూ చాలా అంశాలలో తన కొడుకు పాత్ర ఉందని రాజమౌళి స్వయంగా చెప్పిన సందర్భాలున్నాయి. మరి తాజాగా వేసిన అడుగులు కేవల కాలయాపన కోసమేనా… అన్న రీతిలో చర్చలు జరుగుతున్నాయి. రాజమౌళి కుటుంబం కదా… ఏ చిన్న విషయమైనా వీక్షకులకు ఆసక్తికరమైన అంశమే కదా..!





