ఎన్నికల ముందు చంద్రబాబును ఓడించడానికి కేసీఆర్ ప్రయత్నాలలో తలసానిని వాడుకున్నారో లేక పాత వైరంతో ఆయనే తగులుకున్నారో తెలీదుగానీ టీడీపీపై ఆంధ్రప్రదేశ్ కు వచ్చి మరీ రెచ్చిపోయారు. ఏపీకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం, బీసీలను రెచ్చగొట్టడం వంటివి చేశారు తలసాని. ఆయన కృషి ఏ మేరకు పని చేసిందో తెలీదు గాని చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు. మాములుగా అయితే చంద్రబాబు ఓటమిని తలసాని ఫుల్ గా ఎంజాయ్ చేసేవారు కానీ కథ అడ్డం తిరిగింది.
సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన ఆయన కుమారుడు, సాయి కిరణ్ ఓడిపోయారు. అది కూడా బీజేపీ చేతిలో. దీనితో మంత్రిగా మొహం చూపించలేకపోయారు. మొత్తానికి చాలా రోజులకు తలసాని మళ్ళీ మీడియా ముందుకు వచ్చి టీడీపీ పైనా చంద్రబాబు పైనా విమర్శలు చేశారు ఈరోజు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి వివాదాల పరిష్కారానికి పూనుకోవడం ఓ చరిత్ర అన్నారు. జగన్ కు ఉన్న మెచూరిటీ చంద్రబాబుకు లేకపోవడం వల్లే చాలా విషయాలు అపరిష్కృతంగా ఉన్నాయి అన్నారు.
బీజేపీలోకి టీడీపీ రాజ్యసభ సభ్యులను చంద్రబాబే పంపించారని ఆరోపించారు. అయితే కాలం చెల్లిన నాయకులను పార్టీలో చేర్చుకుంటూ బీజేపీ నేతలు ఏవేవో కలలు కంటున్నారని విమర్శించారు. చూడబోతే కొడుకు ఓటమి నుండి తలసాని ఇప్పటికి కోలుకున్నట్టు ఉన్నారు. ఇటీవలే జరిగిన ఎన్నికలలో టీడీపీకి 23 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు మాత్రం దక్కిన విషయం తెలిసిందే. అలాగే తెలంగాణాలో అనూహ్యంగా బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు, కాంగ్రెస్ కు మూడు గెలవడం సంచలనంగా మారిన సంగతి మనఅందరికీ తెలిసిన విషయమే.



