టీడీపీ యువరాజు నారా లోకేష్ ను కేబినెట్ లో తీసుకునేందుకు వీలుగా విజయవాడ టీడీపీ నేతలు త్యాగాలకు సిద్ధపడుతున్నారు. త్యాగమంటే ఇదేదో మామూలు త్యాగం కాదు, మేము రాజీనామా చేస్తామంటే మేము రాజీనామా చేస్తామంటూ ఒకరిని మించి మరొకరు ప్రకటనలు గుప్పిస్తూ… అధినేతకు తమ విధేయతను చాటి చెప్పడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
అందులో భాగంగా… లోకేష్ కోసం రాజీనామాకు సిద్ధమని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రకటించారు. లోకేష్ లాంటి యువనాయకుల అవసరం పార్టీకి ఉందని, లోకేష్ పెనమలూరు నుంచి పోటీ చేయాలనే ఆకాంక్షించను వెలిబుచ్చుతున్నారు. ఇదిలా ఉంటే, లోకేష్ కోసం తన పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా మరో ప్రకటన చేసారు. బుద్దా అయితే ఒకడుగు ముందుకేసి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి దీనిపై మాట్లాడుతానని కూడా అన్నారు. లోకేష్ ను ఎమ్మెల్సీ చేసి, పెద్దల సభకు పంపి కేబినెట్ లోకి తీసుకోవాలని కోరుతానని బుద్దా అన్నారు.
అయితే టిడిపి నేతలు చేస్తున్న ఈ ప్రకటనలు కాస్త ‘ఓవర్’గా ఉన్నాయని నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. సాధారణంగా రాజకీయాల్లో ఒక్కసారి గెలిచిన తర్వాత ఎవరి కోసమూ పదవులు త్యాగాలు చేయరు. కానీ, లోకేష్ కోసం ఒక్కొక్కరు ముందుకు రావడం నిజంగానే తమ విధేయతను చాటుతున్నారా? లేక అధినేత కంట్లో పడితే ఏదొక రూపేణా లబ్ధి చేకూరుస్తారని భావిస్తున్నారో గానీ, సదరు రాజకీయ నేతలు చేష్టలు మాత్రం కాస్త కామెడీని పండిస్తున్నాయి.





