
ఇటీవలే జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్ తో తెలంగాణ బీజేపీ మరిన్ని మెరుగైన ఫలితాలు రాబట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక, వరంగల్ – ఖమ్మం మునిసిపల్ ఎన్నికల దృష్ట్యా మరింతగా ప్రజల వద్దకు వెళ్ళాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయించుకున్నారు.
బీజేపీ… త్వరలో పాదయాత్రకు రెడీ అవుతుంది. మొదటగా బస్సు యాత్ర చేపట్టి 33 జిల్లా కేంద్రాలను చుట్టి రావాలని ప్లాన్ చేస్తుంది. ఈ బస్సు యాత్రలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రుల వంటి వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.
బస్సుయాత్రలో ఇటీవలే పార్టీలో చేరిన విజయశాంతిని హైలైట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ద్వితీయ శ్రేణి క్యాడర్ పెంచుకుని ప్రజా సమస్యల పై పోరాడటమే లక్ష్యంగా పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. బండి సంజయ్ తెలంగాణ ఉద్యమ హామీలు, తెరాస పాలనలో నెరవేర్చిన అంశాలను ప్రస్తావిస్తూ పాదయాత్ర సాగించనున్నారు.
ఈ రెండు యాత్రలతో గ్రామస్థాయి వరకు పార్టీ బలోపేతం కావటంతో పాటు తెరాస కు ప్రత్యామ్నాయంగా నిలవాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రాకరాక వచ్చిన ప్రజా మద్దతును ఉపయోగించుకుని తెలంగాణలో బలీయమైన శక్తిగా మారాలని బీజేపీ గట్టి ప్రయత్నమే చేస్తుంది.





