అవును… తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేరును ‘గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ నుండి వస్తున్న డిమాండ్ కాదు. టీఆర్ఎస్ కు ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ సభ్యులు చేస్తున్న డిమాండ్. రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సభ్యులు కేసీఆర్ కు ఇంతటి గౌరవాన్ని ఎందుకు డిమాండ్ చేస్తున్నారో తెలిస్తే… అందులో వ్యంగ్యాస్త్రాలు ఏంటో బయట పడతాయి.
అధికారం చేపట్టిన 24 నెలలలో 47 మంది ప్రజాప్రతినిధులను తన పార్టీలోకి చేర్చుకున్న ఘనతను అందుకున్న తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేరును గిన్నీస్ బుక్ లో ఎక్కించాలని కాస్త వెటకారాన్ని పండించారు. జంప్ అయిన 47 మందిలో ఎంపీలు 4, ఎమ్మెల్యేలు 25, ఎమ్మెల్సీలు 18 మంది ఉన్నారు. దీనికి సంబంధించిన పత్రాలను కూడా మీడియాకు విడుదల చేసారు. ఏ పార్టీ నుండి ఎవరు ఏ ఏ తేదీలలో టీఆర్ఎస్ లో చేరారనే విషయంపై ఒక స్పష్టమైన సమాచారాన్ని అందించారు తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నేతలు.
కేసీఆర్ ఆకర్షణకు తెలుగుదేశం పార్టీలో అధికారికంగా ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగలగా, కాంగ్రెస్ కూడా అదే స్థాయికి చేరుకుంటోంది. దీంతో కేసీఆర్ పై ఎదురుదాడే లక్ష్యంగా ఉద్యమించాలని నిర్ణయించుకుంది. అయితే ఇది ఎంతవరకు సత్ఫలితాలను అందిస్తుందో అన్న విషయం ప్రశ్నార్ధకంగానే మారింది. ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు ఇలా విమర్శలు చేస్తున్న సమయంలోనే మరో వైపున మరికొందరు ‘జంపింగ్’కు సిద్ధమవుతున్నారని టాక్.



