‘అతి’ ఏదైనా అనర్థానికి దారి తీస్తుందని టీమిండియా మరోసారి రుజువు చేసింది. ఇక, తమదే గెలుపు అన్న భావన మదిలోకి వచ్చిందో ఏమో గానీ, అప్పటివరకు జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన వారు, నిర్లక్ష్యపు షాట్లతో పెవిలియన్ బాట పట్టి సిరీస్ లో వరుసగా 4వ ఓటమిని మూటకట్టుకున్నారు. దీంతో 5 వన్డేల సిరీస్ లో ఆసీస్ జట్టు 4-0తో ముందు వరుసలో ఉంది.
349 పరుగుల భారీ లక్ష్యాన్ని ధీటుగా ఆరంభించిన టీమిండియా, మొదటి వికెట్ ను రోహిత్ శర్మ (41) రూపంలో కోల్పోయినప్పటికీ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లిల బ్యాటింగ్ తో దాదాపుగా విజయాన్ని సాధించినంత పనిచేసారు. 277 పరుగులకు కేవలం ఒక్క వికెట్ కోల్పోయి, 75 బంతుల్లో 72 పరుగులు చేయాల్సి ఉన్న తరుణంలో ధావన్ 126 పరుగులు చేసి అవుటయ్యారు. ఆ వెంటనే ధోని (0), కోహ్లి (106) వంటి బ్యాట్స్ మెన్లతో పాటు మిగిలిన వారు కూడా పెవిలియన్ వైపుకు వెళ్ళడానికే మొగ్గు చూపడంతో, మరో 4 బంతులు మిగిలి ఉండగా, 323 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయ్యి, ఓటమిని కొనితెచ్చుకుంది.
ఆసీస్ బౌలర్ రిచర్డ్సన్ 5 వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ బ్యాటింగ్ విభాగంలో వార్నర్ 93, ఫించ్ 107, స్మిత్ 51, మాక్స్ వెల్ 41 పరుగులతో చెలరేగారు. దీంతో నిర్ణీత ఓవర్లలో 348 పరుగుల భారీ స్కోర్ నమోదైంది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఆఖరి వన్డే ఈ నెల 23వ తేదీన శనివారం నాడు జరగనున్న నేపధ్యంలో ఆసీస్ జట్టు ‘క్లీన్ స్వీప్’పై కన్నేసింది.
ఈ సిరీస్ ఓటమితో ధోని కెప్టెన్సీ మరోసారి చర్చనీయాంశమైంది. ఓ పక్కన విరాట్ కోహ్లి టెస్ట్ సిరీస్ లను ఎగరేసుకుపోవడాలు, మరో వైపు ధోని వైఫల్యాలు పెద్ద ఎత్తున క్రీడా వర్గాల్లో చర్చలకు దారి తీసింది. ధోని రిటైర్మెంట్ నిర్ణయానికి ఎంతో దూరం లేదని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకప్పుడు ఏ అదృష్టం అయితే ధోని సొంతమైందో, ఇపుడు అదే అదృష్టం ధోని దూరమైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్న వ్యాఖ్యలు.





