తెలంగాణాలో సిఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఏదైనా ‘స్వరం’ వినపదిందంటే, అది ఒక్క రేవంత్ రెడ్డిదే అన్న రీతిలో టీఆర్ఎస్ సర్కార్ పై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తూ ఉంటారు ఈ టిడిపి నేత. దీనికి ప్రతిఫలమే ‘ఓటుకు నోటు’ కేసు అన్న విషయం కూడా రాజకీయ వర్గాల్లో బాగానే ప్రచారం జరిగింది. అయినప్పటికీ వెనక్కి తగ్గని రేవంత్ రెడ్డి, మునుపటి స్థాయిలో కాకపోయినా, ఒక రేంజ్ లోనే కేసీఆర్ పై ఫైర్ అవుతున్నారు.
ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై ఓ ప్రచారానికి తెరలేపింది కేసీఆర్ కు చెందిన ఓ దినపత్రిక. జానారెడ్డికి అత్యంత సన్నిహితుడైన రేవంత్ రెడ్డి పార్టీ మారబోతున్నారని, అధికార పార్టీ టీఆర్ఎస్ కాకుండా మరో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరబోతున్నారని కధనాలు ప్రచురించింది. అసలే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏకైక దిక్కు రేవంత్ రెడ్డి ఒక్కరే. ఆయన కూడా వెళ్ళిపోతే, ఇక పార్టీ మూసేసుకోవడమే తధ్యం అన్న రీతిలో మనుగడ సాగిస్తున్న టిడిపికి ఈ వార్తలు మనోవేదననే మిగిల్చాయి.
అయితే, తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ వార్తలను ఖండించిన రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తోందని, సొంత పత్రికలలో ఈ రాతలు రాయిస్తున్నారని, రాష్ట్రానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో మరియు సిద్ధాంత పరమైన చర్యలలో భాగంగా రెండు ప్రతిపక్ష పార్టీలు (టిడిపి + కాంగ్రెస్) కలిసి పని చేస్తున్నాయే తప్ప, పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్భంగా మరోసారి కేసీఆర్ పై ధ్వజమెత్తారు రేవంత్.
టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆర్డీఎస్ పనులు పూర్తి చేయిస్తానని కేసీఆర్ చెప్పారని, ప్రస్తుతం ఆ హామీని గాలికొదిలేసి తన ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నారని తీవ్ర ఆరోపణలు చేసిన రేవంత్, కమీషన్లకు కక్కుర్తిపడి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ను సిఎం కేసీఆర్ చేపట్టారని మండిపడ్డారు. తన వాగ్ధాటికి ఉన్న పవర్ ను మరోసారి రుచి చూపించారు రేవంత్ రెడ్డి.





