చంద్రబాబు నుండి ఊహించలేని ‘ప్రసంగం’

unexpected-speech-from-chandrababuవర్తమాన రాజకీయాలను అంచనా వేసుకుని ముందుకు వెళ్ళినాడే రాజకీయ నాయకుడిలోని పరిపక్వత బహిర్గతమవుతుంది. మరి ఈ విషయంలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఒకడుగు ముందే ఉన్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ, నిజాం కళాశాల మైదానంలో జరిగిన సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన ప్రసంగం ఇందుకు తార్కాణంగా అభివర్ణిస్తున్నారు.

అవకాశం దొరికితే ఒకరిపై ఒకరు విమర్శల మీద విమర్శలు గుప్పించుకునే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటీవల కాస్త సైలెంట్ అయ్యారు. తాజాగా జరిగిన సభలో కూడా చంద్రబాబు నాయుడు పల్లెత్తు మాట కూడా కేసీఆర్ అనకపోవడం విశేషం. తెలంగాణాలో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీనే లక్ష్యం. ‘ఆపరేషన్ ఆకర్ష్’ పేరుతో అధికార పార్టీ తన పార్టీ సభ్యులందరినీ ఒక్కొక్కరిగా లాగేసుకుంటున్నా, కేసీఆర్ ను విమర్శించక పోవడాన్ని రాజకీయ వర్గాలు ప్రధానంగా చర్చించాయి. ప్రసంగం ఆద్యంతం హైదరాబాద్ లో తానూ చేసిన అభివృద్ధి పనుల గురించే చంద్రబాబు ప్రస్తావించారు.

ADVERTISEMENT

అయితే, అదే సభలో చంద్రబాబుకు ముందు మాట్లాడిన ఆర్.కృష్ణయ్య.., “తమ కార్యకర్తలపై కేసీఆర్ అక్రమ కేసులు పెడితే, బట్టలూడదీసి కొట్టిస్తానని” తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. అలాగే టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి సైతం అంతే స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘చినబాబు’ లోకేష్ కూడా తానేం తక్కువ కాదన్నట్లు తన ప్రసంగంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కానీ, చంద్రబాబు మాత్రం హైదరాబాద్ లో తన హయాంలో జరిగిన అభివృద్ధిపైన, అంటే, పదేళ్ల క్రితం వరకూ జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ… టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలని అడిగారే తప్ప, పాలిస్తున్న ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపే ప్రయత్నం ఒక్కసారైనా చేయకపోవడం గమనార్హం. గ్రేటర్ ప్రజలు మనస్సాక్షితో ఓటేయాలని చెప్పిన చంద్రబాబునాయుడు తన ప్రసంగం ముగించారు.

అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత నెలకొల్పడానికే చంద్రబాబు ఈ విధంగా ప్రసంగించి ఉంటారని, రెండు రాష్ట్రాలు గిల్లికజ్జాలు పెట్టుకుంటే, నష్టపోయేది తెలుగు ప్రజలేనని, చంద్రబాబు ఒకటంటే, కేసీఆర్ మరొకటి అని… ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఇష్టం లేకనే… సంయమనంతో బాబు వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories