గత కొన్ని నెలలుగా ‘కాపు’ సామాజిక ప్రస్తావనతో ఆంధ్రప్రదేశ్ లో ‘కుల’ రాజకీయాలు ఊపందుకున్నాయి. అయితే ఈ ‘కాపు కుల చిచ్చు’ వెనుక వైసీపీ అధినేత జగన్ ఉన్నారని అధికార పక్షం ఆరోపిస్తోంది. అలాగే ప్రభుత్వం కాపులకు అన్యాయం చేస్తున్నారంటూ ప్రతిపక్షం మండిపడుతోంది. ఈ వర్గాల వాదనలు ఎలా ఉన్నా… ఎవరో కావాలని కాపులను రెచ్చగొట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టారని కృష్ణాజిల్లాలో జరిగిన ఘటనతో స్పష్టమైంది.
కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో వంగవీటి రంగా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వంగవీటి రంగా అంటే విజయవాడ పరిసర ప్రాంతాలలో విపరీతమైన క్రేజ్ ఉండడంతో, ఈ వార్తతో జిల్లా మొత్తం వేడెక్కింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, పలు ప్రాంతాల్లో కాపు సంఘాల నేతలు ధర్నాలకు దిగారు. దీంతో పరిస్థితి అదుపు తప్పకుండా ముందు జాగ్రత్త చర్యలుగా పోలీసులు భారీగా సంఖ్యలో మోహరించారు.
ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్ తో పరిశీలించిన పోలీసులు, నిందితులను గుర్తించేందుకు సమీప ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్, నూజివీడు తదితర ప్రాంతాల్లో కాపు యువత, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్లను దిగ్బంధించారు. పని కట్టుకుని ఏపీలో ‘కుల’ రాజకీయాలు రేపుతున్న ఈ నాయకులు ఏపీ అభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నాయన్న వాదనలకు ఇలాంటి సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి. ఇంతకీ రంగా విగ్రహం ధ్వంసం వెనుక ఎవరు ఉన్నారంటారు..?





