కాపులను బీసీల్లో చేర్చేందుకు ఓ కమిటీని నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఓ కాపు కార్పొరేషన్ ను కూడా ఏర్పాటు చేసి 100 కోట్లు నిధులు కేటాయించారు. దీంతో కాపు సంఘాలన్నీ చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పాయి. అలాగే కాపు కులస్తుల్లో చంద్రబాబు పట్ల విశ్వాసం పెరిగింది. ఈ పరిణామాలను గమనిస్తున్న ప్రత్యర్ధి రాజకీయ వర్గాలు, ఎలాగైనా కాపు కులస్తులకు చంద్రబాబు దగ్గర కాకుండా ప్రయత్నాలు చేస్తున్నాయని రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తున్న టాక్.
ప్రస్తుత రాజకీయాల్లో అసలు ప్రాధాన్యత లేని హరిరామ జోగయ్య వంటి వారి చేత వంగవీటి మోహన రంగా హత్య కేసు ఉదంతాలను పలికించిన విషయం తెలిసిందే. కాపులకు ప్రతినిధిగా ఉన్న రంగా హత్యను ముడిపెట్టి చంద్రబాబును ఇరుకున పెడదామని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో… తాజాగా మరో ప్రయత్నాన్ని తెర పైకి తీసుకువస్తున్నాయి.
విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మితం కానున్న దుర్గ గుడి ఫ్లై ఓవర్ కు “వంగవీటి మోహన రంగా” పేరును పెట్టాలని కొత్త ప్రతిపాదనలు తెర పైకి తీసుకువచ్చే పనిలో చంద్రబాబు రాజకీయ ప్రత్యర్ధులు నిమగ్నమయ్యారు. రంగా అభిమాన సంఘం పేరుతో విజయవాడలో నిర్వహించిన ఓ సమావేశంలో ప్రముఖ కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు ఈ దిశగా ఓ ప్రకటన చేసారు. ఈ నెల 26వ తేదీన రంగా వర్ధంతి ఉండడంతో, ఆ తేదీ లోపున చంద్రబాబు తన నిర్ణయం ప్రకటిస్తూ ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేసారు.
రంగా ‘కాలం’ చేసి 26 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ విజయవాడ రాజకీయాలను శాసించే పేరుగా ఉంది. దీంతో ఎలాగైనా రంగా పేరును వార్తల్లో నిలిపి తద్వారా మరోసారి చంద్రబాబును ఇరుకున పెడదామని ప్రత్యర్ధి రాజకీయ వర్గాలు చేస్తున్న ప్రయత్నంగా కనపడుతోందని స్థానిక రాజకీయ వర్గాల సమాచారం. దుర్గ గుడి ఫ్లై ఓవర్ నిర్మాణం అనేది విజయవాడ నగర వాసుల డ్రీమ్. అలాంటి నిర్మాణానికి అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పేరును ఖరారు చేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వ వర్గాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. బహుశా ‘శంకుస్థాపన’ జరిగే రోజున చంద్రబాబు ఆ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.





