అమరావతి, వెలిగొండ కోసం వారి త్యాగాలు.. మరువలేనివి!

Veligonda Project: A New Hope for Drought-Hit Andhra Pradesh

వెలిగొండ ప్రాజెక్టు.. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రాంతాల ప్రజల దశాబ్దాల కల. ఈ ప్రాజెక్టు ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో నీటి కొరత, ఫ్లోరైడ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు దీని ద్వారా తాగునీరు అందుతుంది.

శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను రెండు భారీ సొరంగాల ద్వారా తరలించి, నల్లమల సాగర్‌లో నిల్వ చేస్తారు. దీని కోసం ప్రకాశం జిల్లాలోని సుంకేసుల, గొట్టి పడియ, కాకర్ల ప్రాంతాల్లోని గ్యాప్‌లను కాంక్రీట్ డ్యామ్‌లతో మూసి నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌ నిర్మించారు. దీని పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 43.50 టీఎంసీలు.

ADVERTISEMENT

ఈ నెలాఖరుకి వెలిగొండ సొరంగ మార్గాల నుంచి నీటిని నల్లమల సాగర్ రిజర్వాయర్లోకి విడుదల చేస్తామని సిఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే చెప్పారు.

కనుక ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 11 ముంపు గ్రామాల ప్రజలు ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు 29,645 ఎకరాల భూమి అవసరం కాగా ఇప్పటికే 21,363 ఎకరాలు ప్రభుత్వం సేకరించింది.

మొత్తం 7,321 నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.866 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉండగా, ముంపు గ్రామాలలోని 2,565 కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికే రూ.318 కోట్లు చెల్లించింది. మిగిలిన కుటుంబాలకు వారం రోజులలోగా చెల్లించబోతోంది. నిర్వాసితులు కోరుకున్నవిధంగా కొందరికి వన్-టైమ్‌ సెటిల్‌మెంట్ కింద నగదు చెల్లిస్తోంది. మరికొందరికి సకల సౌకర్యాలతో కాలనీలలో ఇళ్ళు నిర్మించి ఇస్తోంది.

మరోవైపు పోలవరం పనులు కూడా చకచకా సాగుతున్నాయి. కనుక రాబోయే రోజుల్లో అక్కడి నుంచి వరద జలాలను కృష్ణా వైపు తరలించి, రాయలసీమ జిల్లాలోని కరువు ప్రాంతాలకు నీరు అందించేందుకు బనకచర్ల ప్రాజెక్టు కూడా ప్రభుత్వం నిర్మించబోతోంది. ఈ ప్రాజెక్టులో కూడా నల్లమల సాగర్‌ను అనుసంధానం చేయడం ద్వారా అటు చిత్తూరు నెల్లూరు నుంచి ఇటు ప్రకాశం, కృష్ణా డెల్టా వరకు తాగుసాగు నీటి సమస్యలకు శాశ్విత పరిష్కారం చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు పట్టుదలగా కృషి చేస్తున్నారు.

కానీ బనకచర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్‌ పార్టీ అభ్యంతరం చెపుతున్నాయి. ఈ సమస్య అధిగమించగలిగితే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సస్యశ్యామలమవుతుంది.

అమరావతి కొరకు భూములిచ్చిన రైతులు త్యాగాలు ఎంత గొప్పవో, అదేవిధంగా వెలిగొండ ప్రాజెక్టు కోసం పుట్టి పెరిగిన ఇళ్ళను, గ్రామాలను ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించేసి వెళ్ళిపోతున్న గ్రామీణుల త్యాగాలు అంతే గొప్పవి.

ADVERTISEMENT
Latest Stories