హైదరాబాదు చుట్టూ విస్తరించిన ఔటర్ రింగు రోడ్డుపై కొద్దిసేపటి క్రితం భారీ ప్రమాదం చోటు చేసుకుంది. జగన్ ఆర్ధిక ‘ఆయువు పట్టు’గా పరిగణించే వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరియు ఆ పార్టీకి చెందిన మరో ఇద్దరు నేతలు దుర్గాప్రసాద్ రాజు, ధశరథ్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో విజయసాయి సహా రాజు, దశరథ్ లతో పాటు కారు డ్రైవర్ కు కూడా గాయాలయ్యాయి.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన పోలీసులు విజయసాయి, రాజు, దశరథ్ లను హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. ఏపీకి హోదాను డిమాండ్ చేస్తూ వైసీపీ నేడు ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఆందోళనకు సిద్ధమైంది. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరగనున్న ఆందోళనలో పాల్గొనేందుకు సిద్ధమైన విజయసాయిరెడ్డి శంషాబాదు విమానాశ్రయం వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం విజయసాయిరెడ్డి సహా గాయపడ్డ ముగ్గురు వ్యక్తులు పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.





