ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేకి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజలు కోరుకున్నదే నెరవేరుతుందని ఆయన అన్నారు. తమకు న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉందని అన్నారు.. విశాఖకు పరిపాలన రాజధాని వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే మూడు రాజధానులను మెజార్టీ ప్రజలు కోరుకున్నారు అని విజయసాయి రెడ్డి కచ్చితముగా చెప్పెయ్యడమే. 2019 ఎన్నికలలో జగన్ కు అత్యంత భారీ మెజారిటీ వచ్చిన మాట వాస్తవమే. అయితే మూడు రాజధానుల మీద ఎక్కడా అభిప్రాయసేకరణ జరగలేదు.
కనీసం జగన్ ఎన్నికల ముందు ఈ ఐడియా చెప్పి ఉంటే దానికి కూడా ప్రజలు ఆమోదించారు అనుకోవచ్చు. అయితే అమరావతికి పూర్తి మద్దతు… రాజధానిని కొనసాగిస్తాం అని జగన్ ఎన్నికల ముందు కమిట్ అయ్యి ఆ తరువాత మాట తప్పారు. ఆమోదం ఉందని అనుకుంటే అది అమరావతికే ఉంటుంది. ఇక పోతే ఎన్నికల తరువాత కూడా ఎటువంటి అభిప్రాయసేకరణ జరగలేదు.
కేవలం 2019 ఎన్నికలలో జగన్ కు భారీ మెజారిటీ వచ్చింది కాబట్టి ఆయన ఏం చేసినా ప్రజలు ఆమోదించినట్టే అనుకోవడం తప్పే. ఇది ఇలా ఉండగా… ఇప్పటికైనా తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని విజయసాయి రెడ్డి ప్రకటించడం మంచిదే. అదే ఆ పార్టీ వారికి కూడా చెప్పి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చెయ్యడం మానిపిస్తే మరీ మంచిది.





