విశాఖపట్నంలోని రుషికొండపై జగన్ అధికారిక నివాసం కోసం ఇంద్ర భవనాల వంటి ప్యాలస్లు నిర్మించుకోవడం పెద్ద విశేషం కాదు. ఎందుకంటే వైసీపీ హయంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా సకల సౌకర్యాలతో వైసీపీ కార్యాలయాల కోసం ప్యాలస్లు నిర్మించుకున్నారు కనుక.
కానీ రుషికొండపై ఇంద్ర భవనాల వంటి ప్యాలస్లు కూటమి ప్రభుత్వానికి గుది బండల్లా మారడమే విచిత్రం. ఈ విలాసవంతమైన భవనాల విద్యుత్ బిల్లులు, నిర్వహణ ఖర్చులు ప్రభుత్వానికి భారంగా మారాయి.
గత వైసీపీ ప్రభుత్వం రూ.452 కోట్లతో ముఖ్యమంత్రి అధికారిక నివాసం కోసం అత్యంత విలాసవంతంగా ఈ భవనాలను నిర్మించింది. వాటిలో కోట్లు విలువ చేసే ఫర్నీచర్, ఇంటీరియర్స్, గృహోపకరణాలు అమర్చారు. కానీ ప్రభుత్వం మారడంతో అన్ని వందల కోట్లు విలువైన ఆ భవనాలను ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనలతోనే రెండేళ్ళు గడిచిపోయాయి.
ఈ భారం వదిలించుకోవడానికి తగిన సిఫార్సులు చేసేందుకు మంత్రుల సబ్-కమిటీ ఏర్పాటు చేసింది. వారు దేశంలోని హోటల్, టూరిజం రంగాలలో ఉన్న పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో అనేకమార్లు సమావేశమైన తర్వాత, తగినన్ని గదులు లేకపోవడం ప్రధాన సమస్య అని గుర్తించారు. కనుక రుషికొండ భవనాలతో పాటు నాలుగు ఖాళీ స్థలాలను కూడా లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది.
రుషికొండపై 1,200 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన నాలుగు స్థలాలను వారు గుర్తించారు. వాటిలో రెండు అంతస్తుల భవనాలు నిర్మించుకునేందుకు అనుమతించినట్లయితే, ఈ భవనాలను లీజుకు తీసుకునేందుకు స్టార్ హోటల్స్ ముందుకు వస్తాయని గ్రహించారు. కనుక ఈ మేరకు వారు సిఫార్సు చేయగా సిఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. వెంటనే ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 10వరకు గడువు ఇచ్చింది. .
గత ప్రభుత్వం అమరావతిని ఐదేళ్ళు పాడుబెట్టేయడంతో కూటమి ప్రభుత్వం దానిని సరిచేసేందుకు తిప్పలు పడాల్సి వచ్చింది. కానీ విశాఖ రాజధాని అంటూ చేసిన ఈ నిర్వాకం వలన కూటమి ప్రభుత్వం తలపట్టుకోవాల్సి రావడం విచిత్రంగానే ఉంది కదా?






