పుట్టిల్లు – మెట్టిల్లు…ఈడపిల్ల…ఆడపిల్ల అంటూ అన్న వదిలిన బాణంగా ఆంధ్రాలో రాజకీయాలు మొదలు పెట్టి….అన్న వదిలించుకున్న బాణంగా తెలంగాణ రాజకీయాలలో చేరి….అక్కడ ప్రజలు తిరస్కరించిన బాణంగా వెనుతిరిగి ఏపీ వచ్చి నేరుగా అన్నఛాతిలో గుచ్చుకున్నారు షర్మిల.
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న వైస్ షర్మిల వైసీపీ ప్రభుత్వ టార్గెట్ గా ముఖ్యమంత్రి జగన్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. అధికారంలోకి వస్తే కేంద్ర మెడలు వంచి తెస్తాను అన్న ప్రత్యేక హోదా దగ్గర నుంచి రాష్ట్రంలో అమలుచేస్తానన్న సంపూర్ణ మద్యపాన నిషేధం వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వైసీపీ మెడలు వంచుతున్నారు షర్మిల.
షర్మిల ప్రచారం వలన కాంగ్రెస్ పార్టీకి లాభమెంతో ఇప్పుడే చెప్పలేరు కానీ వైసీపీ కి జరిగే నష్టం మాత్రం కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఇలా నిత్యం అన్న పాలన పై అన్న ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ వైసీపీ వైఖరిని ఎండగడుతున్న షర్మిల ఈసారి జరిగే ఏపీ ఎన్నికలలో కాంగ్రెస్ తరుపున ఎన్నికల బరిలో దిగనున్నారనే వార్తలు జోరందుకున్నాయి.
అయితే జగన్ కు వ్యతిరేకంగా పులివెందుల నుంచి షర్మిల కాంగ్రెస్ తరుపున పోటీలో ఉంటారంటూ పలు మీడియా ఛానెల్స్ లో ప్రచారం జరుగుతుంది. అయితే ఏపీలో ఒక పార్టీ అధ్యక్షురాలి హోదాలో పోటీలో నిలబడాలనుకుంటున్న షర్మిలకు అసలు ఏపీలో ఓటు హక్కు ఉందా..? లేదా..? అనే సందేహాలు మొదలయ్యాయి.
అయితే గత ఏడాది తెలంగాణలో జరిగిన ఎన్నికలలో షర్మిల మాదాపూర్ లోని యూరోకిడ్ స్కూల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ఎన్నికలలో షర్మిలకు ఓటు హక్కు లభిస్తుందా..? అంటే సందేహమే. ఓటు హక్కు లేని వ్యక్తి ప్రజలచేత ఓటు వేయించుకోగలుగుతారా..?
షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన నేపథ్యంలో పులివెందులలో తనకున్న ఓటు హక్కును హైద్రాబాద్ కు మార్చుకున్న షర్మిల ఇప్పుడు అనూహ్యంగా తిరిగి ఏపీ రాజకీయాల వైపుకి వచ్చారు. ఈ తరుణంలో షర్మిల మరల తన ఓటు హక్కుని ఏపీ కి మార్చుకుంటారా..? లేక తన అన్న జగన్ చెపుతున్నట్టు నాన్ ఏపీ పీపుల్ కింద ఏపీలో పోటీ చేస్తారా అన్నది వేచి చూడాలి.
2019 ఎన్నికలలో వైస్ జగన్ భార్య వైస్ భారతి రెడ్డి, తల్లి విజయ లక్ష్మితో కలిసి పులివెందులలో వైసీపీ తరుపున తన ఓటు హక్కు వినియోగించుకున్న వైస్ షర్మిల ఇప్పుడు అదే వైస్ జగన్ ను ఓడించడానికి ఆయనకు వ్యతిరేకంగా రాజకీయం చేయడం నిజంగా విధిరాతే అని చెప్పాలి. జగన్ చెపుతున్నట్టు దేవుడు ఉన్నాడు కానీ అది జగన్ వైపా..? మరో వైపా..? అనేది ప్రజలు తేల్చాలి.
షర్మిల ఓటు పరిస్థితి ఇలా ఉంటే…మరి జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి ఈసారి ఎన్నికలలో తన ఓటు హక్కుని ఎక్కడ నుంచి వినియోగించుకుంటారు..? అసలు వినియోగించుకుంటారా..? లేదా..? అనేది కాలమే బదులివ్వాలి. అయితే మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమై జగన్ కు వ్యతిరేకంగా షర్మిల పోటీలో ఉంటే విజయమ్మ ఓటు ఎవరి వైపు అనేది మరో అంతుచిక్కని ప్రశ్నే అవుతుంది.
ప్రతిపక్షం లో ఉన్నప్పుడు తల్లి – చెల్లి అంటూ విలువలు మాట్లాడి…అధికారం వచ్చాక నాది… నీది అంటూ లెక్కలు మాట్లాడకూడదు కదా..! అలా మాట్లాడితే పర్యవసానాలు ఇలానే ఉంటాయని ఇప్పటికైనా జగన్ తెలుసుకుంటారా..? లేక ఇది దేవుడి స్క్రిప్ట్ కాదు బాబు స్క్రిప్ట్ అంటూ తనను తానూ మభ్య పెట్టుకుంటారా..?




