సిఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గత ఎన్నికల సమయంలోనే చిత్తూరు జిల్లా కుప్పంలో భర్త తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ‘కుప్పం నుంచి నేను పోటీ చేస్తే గెలిపిస్తారా?’అంటూ ప్రజలను సరదాగా ప్రశ్నించారు.
అప్పుడామె సరదాకి ఆ మాట అన్నప్పటికీ, తరచూ ఆమె కుప్పంలో పర్యటిస్తూ కార్యక్రమాలలో పాల్గొనడం, రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడటం గమనిస్తే వచ్చే ఎన్నికలలో కుప్పం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లే అనిపిస్తుంది.
నియోజకవర్గంలోని యమగానిపల్లిలో ద్రౌపదీ ధర్మరాజు ఆలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి మాట్లాడుతూ, “నాడు కౌరవులు నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం చేసి ఆమెను, ఆమె భర్తలని అవమానించాలని అనుకున్నారు. అదే విధంగా నాడు శాసనసభలో కొందరు నా గురించి అవమానకరంగా మాట్లాడుతూ, నా భర్తని మానసికంగా దెబ్బ తీయాలనుకున్నారు.
కానీ నాడు శ్రీకృష్ణుడు ద్రౌపదీని కాపాడినట్లు, ప్రజలు మా కుటుంబానికి అండగా నిలబడి మమ్మల్ని కాపాడారు. కనుక మాకు ప్రజలే దేవుళ్ళు. వారి కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తాం. వారి కోసం ఇంకా కష్టపడి పనిచేస్తూనే ఉంటాము. మహిళలను గౌరవించాలని ఈ సందర్భంగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
నాడు మహాభారతంలో తనకు జరిగిన అవమానాన్ని ద్రౌపదీదేవి మరిచిపోనట్లే, నారా భువనేశ్వరి కూడా మరిచిపోలేదని ఈ మాటలతో స్పష్టమవుతోంది.
చంద్రబాబు నాయుడుని మానసికంగా దెబ్బ తీసేందుకు నాడు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజకీయాలకు దూరంగా ఉంటున్న అయన సతీమణి గురించి అసభ్యంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా దేవుడి స్క్రిప్ట్ గురించి మళ్ళీ నాలుగు ముక్కలు చెప్పుకోవాలి. గత ఎన్నికలలో టీడీపి, జనసేనలు కలవకుండా అడ్డుకునేందుకు జగన్మోహన్ రెడ్డి శతవిధాల ప్రయత్నించారు. కానీ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి చేతులారా ఆ రెండు పార్టీలను కలిపారు.
అదేవిధంగా ఒకవేళ నారా భువనేశ్వరి వచ్చే ఎన్నికలలో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశిస్తే, దానికి జగన్మోహన్ రెడ్డే కారణం అవుతారు. ఈసారి దేవుడి స్క్రిప్ట్ లో ఏం వ్రాసుందో?




