రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, దానిలో నేతలు తీరు గురించి అరటి పండు ఒలిచి చేతిలో పెట్టిన్నంత చక్కగా వివరించారు.
ఆదివారం శ్రీకాకుళంలో ఓ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రిగారు మాట్లాడుతూ, “రాజకీయాలలో నేను చాలా నీతి నిజాయితీగా ఉంటాను. మనకున్న ఆస్తులు చాలవా? ఇంకా పరుల ఆస్తులు కూడా మనకి అవసరమా?ఇంకా ఎంత సంపాదిస్తే సరిపోతుంది?ఎవడో సుబ్బారెడ్డట… కడప నుంచి ఇక్కడకు వచ్చాడు. రౌడీయిజం చేసి మన భూములను దొబ్బేయాలనుకున్నాడు.
అసలు నిన్ను ఇక్కడకి ఎవడు రమ్మన్నాడు? శ్రీకాకుళం నీ అబ్బా సొత్తా? కడప నుంచి వచ్చి ఇక్కడ రౌడీయిజం చేయాలని చూస్తే తన్ని పంపిస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించేశాను.
ఆ వచ్చినవాడు మన వైసీపివాడే కదా అని రానిస్తే ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా రౌడీల పాలవుతుంది. అప్పుడు జిల్లాని కాపాడుకోవడం ఎవరి తరం కాదు. అయినా మన జిల్లా మీద ఇతర జిల్లాల పెత్తనం ఏమిటి? దీనిని నేను చాలా అవమానంగా భావిస్తాను.
నేను రాజకీయాలలో ఉన్నంతవరకు శ్రీకాకుళం జిల్లాని ఇలాంటి రౌడీలపాలు కాకుండా కాపాడుకుంటాను,” అని మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి జగన్కు బంధువు, అత్యంత సన్నిహితుడు కూడా. ఎంతగా అంటే ఆయన కోసం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పక్కకు తప్పించి టికెట్ ఇచ్చేంత! అంతేకాదు… ఆయనే వైసీపి ఉత్తరాంధ్రా జిల్లాల సమన్వయకర్త కూడా!
కానీ వైవీ సుబ్బారెడ్డి ఎటువంటివారో, తమ పార్టీ నేతలు ఎటువంటివారో వైసీపికే చెందిన సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు స్వయం చెప్పిన మాటలను కాదనగలమా? విశాఖ రాజధాని పేరుతో ఇప్పటికే వైసీపి నేతలు విశాఖలో విలువైన భూములు కబ్జాలు చేశారని టిడిపి, జనసేనలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా అదే చెపుతున్నారు కదా?




