సాధారణంగా సినీ సెలబ్రిటీలు అంటే ప్రేక్షకులకు కాస్త యావ ఎక్కువ. వారిని తాకాలని, ఓ ఫోటో దిగాలని, లక్ ఉంటే ఓ ముద్దు ఇలా… ఒక్కొక్కరికి సినిమా వాళ్ళపై రకరకాల అభిప్రాయాలు కలగడం సహజమే. అయితే కర్ణాటకలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ బహిరంగ సభలో ఓ మహిళ ఏకంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ముద్దు పెట్టి సంచలనం సృష్టించింది.
చిక్ మగళూరు జిల్లా, తరికేరే పంచాయితీ మహిళా సభ్యురాలైన గిరిజా శ్రీనివాస్ ఓ భారీ బహిరంగ సభలో ఉన్నట్లుండి సభా వేదికపైనే సిఎం సిద్ధరామయ్య బుగ్గ మీద ముద్దు పెట్టేసింది. ఊహించని ఈ పరిణామంతో వెనుక ఉన్న స్థానిక కార్యకర్తలంతా నవ్వులు చిందించగా, సిఎం ముఖంలో కూడా చిరు దరహాసం ప్రత్యక్షమవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా సిఎంతో ఫోటోలకు కూడా ఫోజులిచ్చింది సదరు మహిళా కార్యకర్త.
మొదటిసారి సిఎంను కలవడంతో సంతోషం పట్టలేక, తన తండ్రి లాంటి వాడైన సిఎంను ముద్దు పెట్టుకున్నాను అంటూ ఆ తర్వాత గిరిజా సంజాయిషీ ఇచ్చుకున్నప్పటికీ, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మహిళ ముద్దు పెడుతున్నా సిఎం వారించకపోవడం ఒకటైతే, ఒక రాజకీయ వేదికలపై ఇలా ముద్దుల వేడుకలు ఏంటీ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.



