రాజకీయాలందు వైసీపీ రాజకీయాలు వేరయా అన్న చందంగా సాగుతుంటాయి వైసీపీ రాజకీయాలు. రాజకీయ పార్టీ నేతల, అధినేతల పరామర్శలు, ఓదార్పులు ఎప్పుడు బాధితుల పక్షానే ఉంటాయి. కానీ వైసీపీ విషయంలో ఈ లెక్క తప్పు అనేలా జగన్ తన పరామర్శలను, ఓదార్పులను ఒక్కోసారి నిందితుల పక్షనా కూడా చేస్తుంటారు.
గతంలో గంజాయి బ్యాచ్ కోసం తాడేపల్లి ప్యాలస్ గడప దాటిన జగన్, ఇప్పుడు చట్టాన్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన ఒక మాజీ మంత్రి కోసం అడుగు బయట పెడుతున్నారు. పలాస వైసీపీ మాజీ ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు కుమారుడి హిట్ అండ్ రన్ కేసు వివాదం అందరికి తెలిసన విషయమే.
18 ఏళ్ళ చిన్నపిల్లోడు తెలిసీతెలియక హిట్ అండ్ రన్ కేసులో ఒక వ్యక్తి ప్రాణాలు తీస్తే అది నేరమా.? అంటూ ప్రభుత్వాన్ని ఎదురు ప్రశ్నించారు జగన్. అలాగే ఆ కేసు నుంచి తన కుమారుడుని తప్పించేందుకు సిదిరి చేసిన జిమ్మిక్కులను సమర్థిస్తూ ఆయన పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ సిదిరి తప్పులకు రైట్ మార్క్ కొట్టారు.
దీనితో అటు సోషల్ మీడియాలో వైఎస్ జగన్ ప్రకటనల మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచాయి. అయినా కూడా వైసీపీ తగ్గేదెలా అంటూ ఈ నెల 30 న సదరు సిదిరి అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయనతో ములాఖత్ అయ్యేందుకు వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనకు సిద్ధమయ్యారు.
అంపోలు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సిదిరి తో ములాఖత్ అయ్యి ఆయన కుటుంబాన్ని పరామర్శించి పార్టీ వారికీ పూర్తిగా అండగా ఉంటుందనే భరోసా ఇచ్చేందుకు జగన్ తన శ్రీకాకుళం పర్యటనకు శ్రీకారం చుట్టారు. అయితే సిదిరి కుటుంబానికి జగన్ పరామర్శ వైసీపీ కి రాజకీయ లబ్ది కంటే రాజకీయ నష్టమే ఎక్కువ అనేవారి వాదనే అధికంగా కనిపిస్తుంది.




