జగన్ ‘సక్సెస్’ అయితే చంద్రబాబు ‘ఫెయిల్’ అయ్యారు!

chandrababu-and-ys-jaganఅనుభవం లేని యువనేత… భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా ‘దూకుడు’ను ప్రదర్శించే అధినేత… అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలతో ఎల్లప్పుడూ వార్తల్లో నిలిచే పక్కా రాజకీయ నేత… అవగాహనా రాహిత్యంతో వ్యాఖ్యలు చేసి విమర్శకులకు అవకాశమిచ్చే ‘ఓదార్పు’ నేత… అవును… వైఎస్సార్సీపీ అధినేతగా జగన్ మోహన్ రెడ్డిపై వెల్లువెత్తే ఈ విమర్శలన్నీ వాస్తవాలే! మరో మాటగా చెప్పాలంటే ఈ “కొటేషన్లకు” జగన్ ప్రతిరూపం.

అయితే అదే అనుభవం లేని నేత, అదే అవగాహనా రాహిత్యపు నేత ఒక్క అంశంలో మాత్రం సూపర్ ‘సక్సెస్’ సాధించారు. 2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీలోకి దాదాపు 30 మంది వైకాపా ఎమ్మెల్యేలు జంప్ చేయబోతున్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో బలంగా వినపడింది. సుజనా చౌదరి, సిఎం రమేష్ వంటి వారైతే ‘జగన్ పార్టీకి చెందిన పలువురు శాసన సభ్యులు తమకు టచ్ లో ఉన్నారని ఏ క్షణంలోనైనా వైసీపీని వదిలివేస్తారని’ బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

ఇందులో రాజకీయ వ్యూహం ఎంతున్నా, కొంత వాస్తవం కూడా ఉందని అంగీకరించక తప్పదు. ఇప్పుడు జగన్ కు ‘వీరాభిమాని’గా మారిన కొడాలి నాని కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఈ పుకార్లు షికారు చేసాయో లేదో వైయస్ జగన్ రంగంలోకి దిగి తనకు అనుమానం ఉన్న నేతలందరినీ గుప్పెట్లో పెట్టుకున్నారు. నాయనో, భయానో, బ్రతిమాలో, భామాలో… ఇలా చర్య ఏదైనప్పటికీ తన శాసన సభ్యులను పార్టీ మారకుండా నియత్రించగలిగారు.

జగన్ వయకుసు మించిన రాజకీయ అనుభవం కలిగినటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యారనేది విశ్లేషకుల మాట. ఒక రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా, తెలంగాణాలో తమ శాసన సభ్యులను కాపాడుకోవడంలో చంద్రబాబు ‘ఫెయిల్’ అయ్యారని తేల్చేస్తున్నారు.

సాధారణంగా ప్రతి రాజకీయ పార్టీలో ఒకరిద్దరు నేతలు ఎప్పుడు ‘జంపింగ్ జిలానీ’ల జాబితాలో ఉంటారు. అయితే తెలంగాణా రాష్ట్రంలో బలమైన క్యాడర్ ఉండి కూడా తమ నాయకులను పార్టీ మారకుండా నియత్రించలేకపోతున్నారు. అధికార పార్టీ ఎప్పుడూ తన బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా చేస్తోంది అదే! అలాగే ‘అధికారం’ కోసం రాజకీయ నాయకులు ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. జంప్ అవుతున్న తెలుగుదేశం నాయకుల పరిస్థితి కూడా ఇదే!

ప్రతిపక్షంలో ఉన్నపుడు ఈ రెండింటిపై సమాలోచనలు చేయాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిపై ఉంటుంది. దానిని సక్రమంగా నిర్వర్తించడంలో చంద్రబాబు కొంత మేరకు విఫలమయ్యారనేది అంగీకరించాల్సిన వాస్తవం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఏపీని గాడిలో పెట్టడానికి చంద్రబాబు పడుతున్న తలనొప్పులు అన్ని ఇన్నీ కావు. ఆ కారణం చేతనే తెలంగాణాలో దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

పెట్టుబడులు, రాజధాని నిర్మాణం, సంక్షేమ పధకాల అమలు… వీటన్నిటికి కావాల్సిన రెవిన్యూ జనరేషన్… ఇలా చెప్పుకుంటూపోతే… అసలు ఈ పరిస్తితుల్లో ఏపీకి ఎందుకు ముఖ్యమంత్రిని అయ్యానా? అని ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చూసుకోవడానికే రోజులో ఉన్న 24 గంటలు సరిపోని పరిస్థితి. దీనికి తోడు మరో రాష్ట్రంలో పార్టీ పరిస్థితులను చక్కదిద్దాలంటే సామాన్యమైన విషయం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయినా… నమ్ముకున్న సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చేసే రాజకీయ నాయకులు ఉన్నంత కాలం… అవకాశవాద రాజకీయం రాజ్యమేలుతున్నంత కాలం… అధికారం కోసం రాజకీయ నాయకులు ప్రాకులాడుతున్నంత కాలం… పార్టీ జెండాల కోసం నేతలు వెతుకుతూనే ఉంటారు… అధికారమనే ప్రలోభానికి లొంగుతూనే ఉంటారు..!

ADVERTISEMENT
Latest Stories