మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు ఇంటి వద్దకు వెళ్లి భేటీ అయిన వైసీపీ అధినేత జగన్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించినట్లుగా రాజకీయ వర్గాల టాక్. ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న దాసరికి, ఏకంగా రాజ్యసభ సీటును కేటాయిస్తారని చెప్పినట్లుగా మీడియా వర్గాలలో కధనాలు ప్రసారమవుతున్నాయి.
ఇటీవల బొగ్గు స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దాసరికి ఈ ఆఫర్ ఆకర్షిందని, త్వరలోనే జగన్ చెంత చేరేందుకు ముహూర్తం ఖరారు కావచ్చని తెలుస్తోంది. వైసీపీ అధికార పార్టీలో లేకపోయినా రాజ్యసభ సీటు దక్కితే వచ్చే హోదానే వేరు. ఈ కారణం చేతనే మీడియా వేదికగా జగన్ ను తెగ పొగిడేసారని పొలిటికల్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
అయితే రాజకీయంగా అంతకంతకూ కుచించుకుపోతున్న వైసీపీలో చేరడం దాసరికి ఏ విధమైన ప్రయోజనం సమకూరుస్తుందోనని మీడియా వర్గాలు సమాలోచనలు చేస్తున్నాయి. అలాగే ప్రస్తుత ట్రెండ్ కు దూరంగా ఉన్నటువంటి దాసరిని చేర్చుకోవడం వల్ల జగన్ కు కలిగే ప్రయోజనాలు కూడా అంతు పట్టకుండా ఉన్నాయి. చిరంజీవి కుటుంబానికి ప్రత్యర్థి అన్న ఒకే ఒక్క సానుకూల పరిణామం తప్ప ప్రజల్లో దాసరికి ఉన్న స్థాయి అందరికీ తెలిసిందే. బహుశా అందుకే రాజ్యసభ సీటుకు ఆకర్షితులయ్యారేమో! కాలమే సమాధానం చెప్తుంది..!





