ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో తరచు అసహనానికి గురై అన్ పార్లమెంటరీ బాష వాడుతున్నారని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. మాజీ మంత్రి అచ్చంనాయుడును సభలో ముఖ్యమంత్రి అమర్యాదగా కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా అచ్చం అని సంబోధించడం దారుణం అని వారు అంటున్నారు. అలాగే పర్సనాలిటీ పెరగడం కాదు బుద్ది పెరగాలి అని కూర్చో కూర్చో అంటూ చిరాకుగా సైగలు చెయ్యడం ముఖ్యమంత్రి హోదాకి తగినది కాదని వారు ఆరోపిస్తున్నారు.
ఈరోజు కూడా జగన్ కొంత నోరు జారారు. “ఎలాంటోళ్లను తయారు చేశారయ్యా.. మీరు.. మొత్తం రౌడీలను, గూండాలను తీసుకొచ్చారు” అని టీడీపీ సభ్యులు, అధినేతపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తీరుపై విశ్లేషకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సభానాయకుడుగా ఉండే ముఖ్యమంత్రి ఆ స్థాయికి తగిన ప్రవర్తన అలవర్చుకోవాలని వారు సలహా ఇస్తున్నారు. సోషల్ మీడియాలో జగన్ ప్రవర్తన కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అధికారం రావడంతో అహంకారం పెరిగిందని, ముఖ్యమంత్రి ప్రవర్తన తన స్థాయికి తగట్టు లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి ప్రవర్తన వల్ల ప్రతిపక్షానికి మేలు జరుగుతుందని స్వపక్షం వారే అభిప్రాయపడటం విశేషం. జగన్ సభలో ఈ వ్యాఖ్యలు చేస్తుండగా కొందరు సీనియర్ల మొహాలపై రంగులు మారడం స్పష్టంగా కనిపించింది. అయితే ఎవరూ జగన్ కు చెప్పే పరిస్థితి లేదు. టీడీపీ గనుక ప్రభుత్వం మీద బీసీ కార్డు ఉపయోగిస్తే మొత్తానికే మోసం రావొచ్చు అని వారు మదన పడుతున్నారు.



