ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ టిడిపి చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’కు వైసీపీ విలవిలలాడుతున్న వైనం తెలిసిందే. దీంతో తెలుగుదేశం పార్టీపై మరియు ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఓ స్థాయిలో మండిపడుతున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని 30 కోట్లకు కొనుగోలు చేస్తున్నారని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న జగన్ మరో వైపు తెలంగాణాలో తన పార్టీ ఎమ్మెల్యేలు మారినా కనీసం నోరు మెదకపోవడం విశేషం. అంటే జగన్ సమ్మతితోనే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారా? లేక తెరవెనుక కేసీఆర్ – జగన్ ల ఒప్పందం ఉందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా తెలుగుదేశం అధినేత రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి ప్రశ్నలనే సంధించారు.
ఏపీలో తన పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేస్తోందని ఊరూరా తిరిగి ఆరోపణలు గుప్పిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణలో తన పార్టీ నేతల ఫిరాయింపులపై ఎందుకు మాట్లాడటం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వైసీపీకి చెందిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ నెల 4వ తేదీన టీఆర్ఎస్ లోకి చేరబోతున్నానని ప్రకటన చేసిన సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసాయి. రేవంత్ రెడ్డి చెప్పినట్టు నిజంగానే టీఆర్ఎస్ పై గానీ, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై గానీ జగన్ ఒక్క విమర్శ కూడా చేయకపోవడం గమనించదగ్గ విషయమే.
లాజిక్ లాంటి మాటలతో మ్యాజిక్ చేయడం రేవంత్ రెడ్డి స్పెషాలిటీ. తాజాగా కూడా అలాంటి లాజిక్ తోనే వైసీపీ అధినేత జగన్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారు. పొంగులేటి పార్టీ మారడంపై జగన్ స్పందించకపోతే రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలే నిజమని ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అలాగే రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తున్నట్లు కేసీఆర్ – జగన్ ల మధ్య రహస్య ఒప్పందం ఉందన్న మాటలకు బలం చేకూరుతుంది.





