వంగవీటి వారి మీద ప్రేమతో దేవినేనిని కలుపుకున్నారా..?

YS Jagan

వైసీపీ నాయకుల వ్యాఖ్యలు ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ ప్రత్యర్థి పార్టీల మీద చేసే విమర్శలు చూస్తుంటే ఏపీ ప్రజలు గజనిలా…అనే అనుమానాలు తలెత్తుతాయి. మొన్నఒకటి, నిన్నొకటి, ఈరోజుకొకటి అన్నట్లుగా అవసరానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు మాటల గారడితో ప్రజలను బురిడీ కొట్టించడానికి తనవంతు ప్రయత్నాలు తానూ చేస్తూనే ఉంటారు.

చేతిలో ఒక సొంత పత్రిక, ఒక సొంత మీడియా ను అడ్డుపెట్టుకుని, అధికారం ఉందనే అవకాశంతో మరికొన్ని ఛానెల్స్ ను తన గుప్పెటలో పెట్టుకుని, వేలాది సోషల్ మీడియా అకౌంట్లను ఏర్పాటు చేసుకుని ‘తానూ చెప్పిందే వేదం…తానూ చేసేదే న్యాయం’ అన్నట్టుగా ముందుకెళ్తున్న జగన్ బహిరంగ సభలలో ప్రతిపక్షాలు మీద చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఏపీ ప్రజలు మరింత అమాయకులా అనే అనుమానం కలగక మానదు.

ADVERTISEMENT

కుప్పం బహిరంగ సభలో మాట్లాడుతూ తమకు అలవాటైన కుల చిచ్చులను రగిల్చే ప్రయత్నాలు చేసారు. ఎవరు ఔనన్నా కాదన్నా ఏపీ రాజకీయాలు కులాల ఆధారంగా తన దిశను మార్చుకుంటుంది అనేది వాస్తవం. అయితే టీడీపి – జనసేన పొత్తుతో రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు టీడీపి వైపు వచ్చే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న కాపు సామజిక వర్గాన్ని రెచ్చగొట్టడానికి ఇప్పటికే పవన్ టార్గెట్ గా ఒక పక్క విమర్శలు చేస్తూనే మరో పక్క వంగవీటి చరిత్రను మరోసారి తెర మీదకు తెచ్చారు జగన్. వంగవీటి హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని, ఇటువంటి నాయకుడి కాళ్ళ దగ్గర కాపు సోదరుల ఓట్లు తాకట్టు పెట్టడానికి పవన్ సిద్దమయ్యారంటూ వంగవీటి కుటుంబం పై కపట ప్రేమ కురిపించారు జగన్.

అయితే వంగవీటి – దేవినేని రెండు కుటుంబాల మధ్య జరిగిన ఆధిపత్య పోరుని రెండు కులాలకు ఆపాదిస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగిస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న నేతలు అసలు నిందితులను తమ వెనుక పెట్టుకుని బాధితుల పై చేస్తున్న ఈ రాజకీయ విమర్శలకు చరమ గీతం పాడాల్సిన సమయం ఆసన్నమయింది అంటున్నారు రంగా అభిమానులు.

వంగవీటి – దేవినేని కుటుంబాలు రెండు రాజకీయంగా కూడా ఎప్పుడు ప్రత్యర్దులుగానే ఉంటారు. ఒక కుటుంబం ఒక పార్టీలో ఉంటే మరో కుటుంబం ఆ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న పార్టీలో ఉంటారు. వంగవీటి రాధా వైసీపీ లో ఉన్న క్రమంలోనే ఆయనకు రాజకీయంగా చెక్ పెట్టడానికి ఆయన ప్రత్యర్థి వర్గమైన దేవినేని అవినాష్ ను పార్టీలో చేర్చుకున్నారు జగన్.

దీనితో మస్తాపానికి గురైన రాధా వైసీపీ వీడి టీడీపి కండువా కప్పుకున్నారు. అలాగే వైసీపీ పార్టీలో ఉన్న గౌతమ్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకుని వంగవీటి రంగా మీద అనుచిత వ్యాఖ్యలు చేయలేదా..? అటువంటి వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి జగన్ ప్రోత్సహించలేదా..? నిజంగా వంగవీటి కుటుంబం మీద, కాపు సమాజక వర్గం మీద జగన్ కు అంత వల్లమాలిన ప్రేమే ఉంటే రాధను పొమ్మనలేక పొగపెడతారా..?

అలాగే వంగవీటి కుటుంబానికి రాజకీయ శత్రువులైన దేవినేని కుటుంబాన్ని చేరదీస్తారా..? రంగా మీద విమర్శలు చేసిన వారికి పదవులు కట్టబెడతారా..? బాబాయ్ వివేకా హత్య కేసులో కూడా ముందు బాబు హస్తం ఉంది అన్నారు తరువాత కుటుంబ సభ్యులే ఆస్తి కోసం ఈ ఘాతకానికి ఒడిగట్టారు అంటూ సొంత చెల్లి కుటుంబం పై విమర్శలకు దిగారు. ఇప్పుడు కూడా కాపు సామాజికవర్గాన్ని రెచ్చగొట్టడానికి ఇదే ఫార్ములా వాడుతున్నారు జగన్. మరి ఈసారి కూడా మోసపోవడానికి కాపు సోదరులు సిద్ధమా..?

ADVERTISEMENT
Latest Stories