ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వాన్పిక్ వ్యవహారంలో రస్అల్ఖైమా ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. తీర ప్రాంత అభివృద్ధి పేరిట దివంగత సీఎం వైఎస్ హయాంలో 2005-2006లో వాన్పిక్ కోసం భూ సేకరణ చేపట్టడం జరిగింది. ఇందుకుగాను గుంటూరు, ప్రకాశం జిల్లాలో దాదాపు 29 వేల ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు భూములు ఇవ్వడం కోసం అప్పట్లో అన్ని రూల్స్ నూ పక్కన పెట్టారట.
అందుకు ప్రతిఫలంగా నిమ్మగడ్డ జగన్ కంపెనీలలో దాదాపుగా 850 కోట్లు పెట్టుబడి పెట్టారు. నాడు వైఎస్ జగన్తోపాటు మంత్రి మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ చేశారు. ఈ కేసులో సుమారు 16 నెలలకు పైగా జైలులోనే గడిపిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు రంగంలోకి దిగారని పుకార్లు షికారు చేస్తున్నాయి. సెర్బియా నుంచి ఆయన్ను ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారట.
ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్కు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు లేఖ రాశారని , సెర్బియాతో సంప్రదింపులు జరపి నిమ్మగడ్డను అరెస్ట్ చేయకుండా సురక్షితంగా ఇండియాకు తరలించేలా చూడాలని లేఖలో పేర్కొన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ న్యూస్ ను పెద్ద ఛానెల్స్ బ్లాక్ అవుట్ చేశాయి. అసలు అరెస్టు విషయమే ఎక్కడా ప్రసారం చెయ్యలేదు. జగన్ కోసం కేసీఆర్ తన అదుపాజ్ఞలలో ఉన్న మీడియాను కట్టడి చేశారని టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.



