ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. కర్నూలు జిల్లా నేత భూమా నాగిరెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో నేడు కర్నూలు రాజకీయ నేతలను చంద్రబాబు స్వయంగా ఆహ్వానించడం, భూమా చేరికను వ్యతిరేకిస్తున్న శిల్పా సోదరులతో పాటు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిని చర్చల్లో భాగం చేయడంతో భూమా నాగిరెడ్డి, అఖిలప్రియల చేరికకు చంద్రబాబు సానుకూలంగా ఉన్నారన్న సంకేతాలు వెలువడ్డాయి.
కర్నూలు జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉన్నప్పటికీ, భూమా వస్తే తమ రాజకీయ జీవితాలు మసక బారుతాయని పలువురు టిడిపి నేతలు భావిస్తున్నారట. ఇదిలా వుండగా, భూమాను వదులుకోరాదని భావిస్తున్న వైకాపా అధినేత, సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, వైవీ సుబ్బారెడ్డి, మోపిదేవి వెంకటరమణ తదితరులను రంగంలోకి దించారు. కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, ఐసయ్య, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జయరాములు తదితరులతో సమావేశమై భూమాను బుజ్జగించే ప్రయత్నం చేసారు.
పార్టీలో పీఏసీ చైర్మన్ ద్వారా తన తరువాత రెండో నేత హోదాను ఇచ్చారన్న విషయాన్ని జగన్ సూచనల మేరకు భూమాకు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో భూమా కాస్త శాంతించారని, పార్టీ మార్పుపై పునరాలోచిస్తున్నారని, అవసరమైతే జగన్ తో మరో మారు భేటీ అవనున్నారని మీడియా వర్గాలు ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి. భూమా – జగన్ ల భేటీ జరిగినట్లయితే ఇప్పట్లో పార్టీ మారకపోవచ్చు గానీ, ఒకవేళ భేటీ జరగనట్లయితే భూమా షాక్ ఇవ్వడం ఖాయంగా కనపడుతోందని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే బుజ్జగింపుల పర్వంలో మాత్రం జగన్ చేతులెత్తేసినట్లుగా తెలుస్తోంది.





