2019 ఎన్నికల ముందు జరిగిన వివేకా హత్య…ఆ ఎన్నికలలో వైసీపీకి ఒక అస్త్రంలా మారింది. ప్రతిపక్షం లో ఉన్న జగన్ తన బాబాయ్ హత్యకు అధికార పార్టీ టీడీపీ, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమా అంటూ ఎన్నికల ప్రచారంలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ, తమకు అనుకూల మీడియాలో బాబుకు వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేసి ఒక్క ఛాన్స్ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.
అయితే కారణం ఏదైనా కావచ్చు ఆ నాటి ఎన్నికల ప్రచారంలో జగన్ ఎంచుకున్న కీలక విషయాలలో జగన్ మీద జరిగిన కోడికత్తి ఘటన ఒకటి, వివేకా హత్య సంఘటన మరొకటి. ఈ రెండిటినీ ప్రధాన ఎజెండాగా తీసుకుని ఎన్నికలకు వెళ్లిన వైసీపీ ని అడ్డుకోవడంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. అలాగే వారిని కట్టడి చేయడానికి కూడా ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేక పోయింది.
మోనంగా ఉంటే వచ్చే ప్రమాదం ఏంటో, దాని ఫలితాలు ఎలా ఉంటాయో తెలిసిన జగన్ ఈ నాటి ప్రతిపక్షాలకు ఆ అవకాశం ఇవ్వదలచుకోలేదు అనేలా ప్రస్తుత పరిస్థితులను మార్చేస్తున్నారు. 2019 ఎన్నికలలో వైసీపీ విజయానికి దోహదపడిన వివేకా హత్య కేసు 2024 ఎన్నికలలో అదే వైసీపీ పతనానికి దారితీసింది. ప్రతిపక్ష పార్టీలన్నీ అటు టీడీపీ, జనసేన, బీజేపీ తో పాటు కాంగ్రెస్, వివేకా కుమార్తె సునీతా కూడా వివేకా హత్య పై వైసీపీ ని ఇరుకున పెడుతున్నాయి.
వివేకా హత్యకు అవినాష్ రెడ్డే కారణం, ఆయనను జైలుకు వెళ్లకుండా కాపుకాస్తుంది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డే అంటూ నిత్యం మీడియా ముందు తన వాదనను వినిపిస్తున్నారు సునీత. అలాగే వైసీపీ కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న అవినాష్ పై కాంగ్రెస్ పార్టీ తరుపున వైస్ షర్మిల పోటీకి సై అనడంతో అవినాష్ కు చెక్ పెట్టడానికి షర్మిల కూడా ఇదే అంశాన్ని ఎంచుకున్నారు. అటు బాబు, పవన్, లోకేష్ కూడా ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ వైసీపీ ని ప్రశ్నించడంతో వివేకా అంశం ప్రజలలోకి బలంగా వెళ్లి ఒక్కసారిగా వైసీపీ డిఫెన్స్ లో పడిపోయింది.
ఇటువంటి తరుణంలో కడప కోర్ట్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఎన్నికల ప్రచారంలో వైస్ వివేకా రెడ్డి హత్య పై ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివేకా హత్య గురించి బాబు, పవన్, లోకేష్, సునీత, షర్మిల, పురందరేశ్వరి, బీటెక్ రవి ఎవ్వరు మాట్లాడకూడదు అంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనితో ప్రతిపక్షాల విమర్శల తాకిడి నుండి వైసీపీ కి కాస్త ఉపశమనం దొరికినట్లయింది.
పొద్దున్న లేస్తే రాష్ట్రంలో జగన్ కు వ్యతిరేకంగా ఏ చిన్న సంఘటన జరిగిన దానికి బాబే కారణమంటూ ఆరోపిస్తూ, కోర్ట్ తీర్పులను కూడా బాబు మేనేజ్ చేయగలరు, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బాబు అపర మేధావి అంటూ నిందలు వేసే వైసీపీ నేతలు ఇప్పుడు ఏ వ్యవస్థలను మేనేజ్ చేసి ఈ ఆదేశాలు తీసుకువచ్చారో చెప్పగలరా..? అలాగే టీడీపీ, జనసేనలో పొత్తులో ఉన్న బీజేపీ తనకున్న అదనపు అడ్వాంటేజ్ తన మిత్ర పక్షాల గెలుపు కోసం వినియోగిస్తుందా..? లేక తన ప్రత్యర్థి విజయం కోసం సాయపడుతుందో అనే ‘నిజం’
రాష్ట్ర ప్రజానీకానికి తెలియాలి.




