గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విస్తృతంగా చర్చింపబడుతున్న పేరు సాయికృష్ణ. ఈ పేరు మీదే వైసీపీ కుల రాజకీయాలు చేస్తుంది, ఈ పేరు మీదే వైసీపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా, రాజకీయంగా, కులం ప్రాతిపదికగా టార్గెట్ చేస్తున్నారు.
అయితే సాయికృష్ణ మిస్సింగ్ తో మొదలైన ఈ కేసు ఆ తరువాత సాయికృష్ణ లాకప్ డెత్ అంటూ ప్రచారంలోకి వచ్చింది. విజయవాడకు చెందిన సీఐ నాగరాజు, సాయికృష్ణ ను లాకప్ డెత్ చేసారని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో సదరు సీఐ ని సీపీ సస్పెండ్ చేసారు.
అయితే ఈ ఆరోపణల పై విచారణకు ఆదేశించిన కూటమి ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ ను నియమించింది. ఇక కేసు విచారణ మొదలుపెట్టిన సిట్ బృందం సీఐ నాగరాజును అదుపులోకి తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టగా సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ కాస్త బయటపడింది.
ఈ కేసును విచారణకు స్వీకరించిన ప్రత్యేక బృందం న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. గాదె సాయికృష్ణ ది లాకప్ డెత్ అని, పోలీస్ కస్టడీలో తగిలిన గాయాల వలనే సాయికృష్ణ మరణం సంభవించిందని సిట్ తన ప్రాథమిక దర్యాప్తులో నిర్దారించింది.
సాయికృష్ణ ను మే 6 న మార్కాపురం టాస్క్ ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకోగా, ఆ తరువాత సాయికృష్ణ ను విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు సిట్ విచారణలో బయటపడింది. అయితే మే 1 నుంచి జూన్ 1 వరకు కృష్ణలంక పీఎస్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా పూర్తిగా మాయమైపోయింది.
అయితే ఇప్పటి వరకు సాయికృష్ణ మిస్సింగ్ అనుకున్న కేసు కాస్త ఇప్పుడు సాయికృష్ణ లాకప్ డెత్ అని నిర్దారణ జరగడంతో ఇక ఈ కేసులో తదుపరి చాప్టర్ -2 అసలు సాయికృష్ణ కి సిఐ నాగరాజుకు మధ్య ఎం జరిగింది.? అసలు సాయికృష్ణ ను అదుపులోకి తీసుకున్న తరువాత కోర్ట్ లో హాజరుపరచకుండా పోలీసులు కస్టడీ కి ఎందుకు తీసుకున్నారు.?
ఆయనను కస్టోడియల్ టార్చర్ కు ఎందుకు గురి చేసారు.? లాకప్ డెత్ వెనుక ఉన్న కారణాలు.? చంపబడిన సాయికృష్ణ మృత దేహం ఎక్కడ.? కృష్ణలంక పీఎస్ లో సీసీ టీవీ ఫుటేజ్ మాయం వెనుక ఎవరున్నారు.? చట్టాన్ని అతిక్రమించి హద్దులు దాటిన సిఐ నాగరాజు కి సహకరించిన ఇతర అధికారులెవరు.? ఇలా అనేక ప్రశ్నలకు చాప్టర్ -2 లో సమాధానాలు లభించే అవకాశం ఉంది.




