సీజేపీ చేపట్టిన నీట్ ఉద్యమ స్ఫూర్తి తో జీన్ జీ ల మద్దతు కూడగట్టి కూటమి ప్రభుత్వ మెడలు వంచాలని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా డిమాండ్ తో వైసీపీ చేపట్టిన డీఎస్సీ ఉద్యమంలో ఇంతకీ వైసీపీ పాస్ అయినట్టా ఫెయిల్ అయినట్టా.?
* ముందుగా కాక్రోచ్ జనతా పార్టీ మాదిరి వైసీపీ తన డీఎస్సీ ఉద్యమంతో జీన్ జీ ల మనసు గెలవలేకపోయింది. వారిని తమ ఉద్యమంలోకి తీసుకురాలేకపోయింది. వారిని తమ పోరాటాలలో భాగస్వామిని చేయలేకపోయింది. ప్రచారానికే తప్ప క్షేత్ర స్థాయిలో వైసీపీ జీన్ జీ ల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఇది వైసీపీ మొదటి ఫెయిల్యూర్.
* ఇక సీజేపీ నీట్ ఉద్యమానికి పేపర్ లీకేజ్ అనేది ఒక బలమైన ఆయుధం కనిపిస్తుంది. కానీ వైసీపీ డీఎస్సీ అక్రమాల ఆరోపణలకు వైసీపీ దగ్గర బలమైన ఆధారాలు కనిపించడం లేదు. ఇది వైసీపీ మరో ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఒకసారి డీఎస్సీ పేపర్ లీకేజ్ అని మరోసారి అక్రమాలని ఇలా వైసీపీ నే రోజుకో మాటమార్చుతూ ప్రజలనే కాదు పార్టీ శ్రేణులను సైతం అయోమయానికి గురి చేస్తుంది.
* సీజేపీ ఉద్యమం బాధితులనే కాదు ప్రజలందరినీ సంఘటితం చేయగలిగింది, వారందరిని ఒకే ఆలోచనలో నిలబెట్టగలిగింది. నీట్ ఉద్యమంలో సీజేపీ తో పాటుగా సామాన్య ప్రజానీకం సైతం చేయి కలిపారు. దీనితో సీజేపీ నీట్ ఉద్యమం ప్రజాపోరాటంగా మారింది, కేంద్ర ప్రభుత్వ మెడలు వంచింది, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు వెళ్ళింది.
*మరి వైసీపీ డీఎస్సీ ఉద్యమం విషయానికొస్తే, వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీలు, రిలే నిరాహారదీక్షలు వైసీపీ నేతలు, ఆ పార్టీ క్యాడర్ కి మాత్రమే పరిమితం అయ్యాయి. దీనితో వైసీపీ పోరాటాలు కేవలం పార్టీ కార్యక్రమాలుగా, నేతల బల ప్రదర్శనలుగా మిగిలిపోతున్నాయి. ఈ విషయంలో కూడా వైసీపీ ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తుంది.
* సీజేపీ నీట్ ఉద్యమం విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం మొదలై చివరికి ఫలితం సాధించే వరకు కొనసాగింది. ఈ ఉద్యమంలో సీజేపీ పోరాటాలు రాజకీయానికి అతీతం అన్నట్టుగా సాగాయి. ముందు సమస్య పరిష్కారం ఆ పై రాజకీయం అన్నట్టుగా ముందుకెళ్లాయి. అలాగే సీజేపీ తన ఉద్యమాలతో ‘కేంద్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ ని ప్రజలకు చూపించగలిగింది కాబట్టే తన నీట్ ఉద్యమంలో పాస్’ అవ్వగలిగింది.
* కానీ వైసీపీ డీఎస్సీ విషయంలో ముందు రాజకీయం ఆ పై కూడా రాజకీయమే అన్నట్టుగా సాగుతున్నాయి. వైసీపీ బాధితులుగా ప్రచారం చేస్తున్న వారే మేము బాధితులం కాదు లబ్దిదారులం మహాప్రభో అంటూ ఉద్యమించడంతో ఇక్కడ వైసీపీ పోరాటాలకు ప్రజల భాగస్వామ్యం కరువయ్యింది. ఒకరకంగా అసలు వైసీపీ పోరాట బాధితులెవరు అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది.
* అలాగే కూటమి ప్రభుత్వ ఫెయిల్యూర్ ని ప్రజలకు ఆధారాలతో చూపించే విషయంలో కూడా వైసీపీ పూర్తిగా ఫెయిల్ అవ్వడంతో వైసీపీ తానూ మొదలుపెట్టిన డీఎస్సీ ఉద్యమంలో కూడా పాస్ అవ్వడం కష్టంగానే కనిపిస్తుంది. మరి వైసీపీ ఇక్కడితో అయినా ప్రజలు మెచ్చని ఈ పోరాటాలకు, నాయకులు దిగిరాని ఉద్యమాలకు స్వస్తి పలుకుతుందా.?



