వైసీపీ అధినేత జగన్ విదేశాల్లో సరదాగా ఆడుతున్న ఆటలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. గత మూడు రోజుల నుండి వరుసగా ప్రత్యక్షమవుతున్న ఈ ఫోటోలపై టిడిపి నేతలు సైలెంట్ గా ఉన్నప్పటికీ, వైసీపీ వర్గీయులే జగన్ పై మండిపడుతున్నారని సమాచారం. బ్రిటన్ పర్యటనకని వెళ్ళిన జగన్, పోలో, ఫుట్బాల్, చెస్ వంటి ఆటలలో లీనమై కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉంటే.., అసలు జూలై 8న ‘గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ’ అనే కార్యక్రమాన్ని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, ఎరువుల సమస్య, కరువు, ఉద్యోగుల తరలింపు వంటి అంశాలను ప్రజల వద్ద ప్రస్తావించి వారికి చేరువ కావాలన్నదే ఈ నినాదంలోని ముఖ్య ఉద్దేశం. అయితే, దీన్ని పక్కనపెట్టి జగన్ ఇప్పుడు చేస్తున్నదేమిటి? పార్టీని పక్కనపెట్టి తానైతే ఎన్ని టూర్లైనా తిరుగుతారని వైసీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లుగా పొలిటికల్ వర్గాలలో హల్చల్ చేస్తున్న సమాచారం.
ఒకప్పుడు తాము విహారయాత్రలకు వెళ్తామని ఎమ్మెల్యేలు చెబితే జగన్ ఒప్పుకోలేదు. గత నెలలోనే కొంతమంది ప్రజాప్రతినిధులు ఆటవిడుపు కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నారు. కానీ, ఎవరినీ సంప్రదించకుండా జగన్ మే 16న కర్నూలులో జలదీక్షకు దిగారు. అమెరికా టూర్కి వెళ్తామని కొందరు ఎమ్మెల్యేలు కోరితే, అప్పుడు కూడా అంగీకరించలేదు. ఓవైపు రాష్ట్రంలో కరువు ఉండగా, సీఎం చంద్రబాబు విదేశీయాత్రకు వెళ్ళడాన్ని తప్పుపట్టిన జగన్.., ఇప్పుడు చేస్తున్నదేమిటని వైసీపీ నేతలో చర్చలు జరుపుకోవడం విశేషం. జూలైలో ఎలాగైనా అమెరికా వెళ్ళి తీరాలని అనుకున్న వారంతా, ఇప్పటికే వీసాలు కూడా సిద్ధం చేసుకోవడం విశేషం.
నిజానికి వైసీపీ ఎమ్మెల్యేలు సరిగ్గా జూలై మొదటి వారంలోనే విహారయాత్ర తలపెట్టారు. అమెరికాలో జూలైలో జరిగే ‘ఆటా’ మహాసభలకు వెళ్లి, పనిలో పనిగా నెల రోజుల పాటు అమెరికాను చుట్టి రావాలన్నది ప్లాన్. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ 7వ తేదీ లోగా వచ్చేయాలని, ప్రజాసమస్యలపై 8న పోరాడాల్సి ఉందని కొందరు ముఖ్య నేతలు ఒత్తిడి తెస్తుండడంతో ఓపిక నశించిన సదరు నేతలంతా, ముఖ్య నేతలపై తీవ్రస్థాయిలో మండిపడినట్లు సమాచారం.
‘మేం విదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడే ప్రజాసమస్యలు గుర్తుకొస్తాయా? ఇప్పుడు మాత్రం సమస్యల్లేవా? మరి జగన్ బ్రిటన్ ఎలా వెళ్తారు? మమ్మల్ని ఆనాడు మందలించి, కోప్పడి ఇప్పుడు జగన్ చేస్తున్నదేమిటి? ఆయన్ను ఎందుకు ఆపలేదు?’ అంటూ సదరు నేతలంతా తిరుగుబావుట ఎగుర వేసినట్లుగా తెలుస్తోంది. దీంతో జూలై 8న ‘గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం’ విజయవంతం కావడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలావుండగా, జగన్ విదేశీ పర్యటనపై నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆనాడు జగన్ జైలు నుంచి విడుదలైన తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోవడం జరుగగా, తాజాగా బ్రిటన్ పర్యటనకు వెళ్లినప్పుడే యూరోపియన్ యూనియన్ నుంచి ఆ దేశం వేరుకావడం వంటి సందర్భాలను ప్రస్తావిస్తూ.. ఆ రెండింటికీ జగనే కారణమన్నట్టుగా సోషల్ మీడియాలో ధ్వజమెత్తుతున్నారు.



