ఏపీలో కుల రాజకీయాల వ్యాప్తికి వైసీపీ సిద్ధమవుతోందా.? అందులో భాగంగానే నిన్నటి వరకు కాపు సామాజికవర్గం కేంద్రంగా నడిచిన వైసీపీ రాజకీయం ఇప్పుడు బీసీ వైపుకి మళ్ళిందా.? కాపు సామాజికవర్గం కేంద్రంగా సాగిన కుల రాజకీయాలలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కాపు టైగర్ గా జగన్ దగ్గర ప్రశంసలు పొందారు.
ఇక ఇప్పడు అదే మాదిరి వైసీపీ బీసీ సామాజికవర్గానికి బ్రాండ్ అంబాసిడర్ గా జోగి రమేష్ ను తెరముందుకు తీసుకురాబోతుందా.? నేడు మీడియా ముందుకొచ్చిన జోగి రమేష్ చంద్రబాబు పాలనలో బీసీ లకు అన్యాయం జరుగుతుందని, కూటమి ప్రభుత్వంలో బీసీలకు భద్రతా కరువయ్యిందని బీసీ సామాజికవర్గ సంక్షేమం కోసం వైసీపీ బీసీ గర్జన పేరుతో సభ నిర్వహించబోతుందంటూ ప్రకటించారు.
ఆగస్టు 9 న విజయవాడ లో బీసీ ల రణభేరి నిర్వహిస్తామని, బీసీ లంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బీసీ లంటే బ్యాక్ బోన్ అని జగనన్న ప్రభుత్వంలో చేసి చూపించమని, అభినవ పూలే జగనన్న అంటూ జోగి బీసీల పేరుతో జగన్నామస్మరణ చేసారు. అలాగే ఈ బీసీల సభతో బీసీ సామాజికవర్గాన్ని మొత్తం ఐక్యం చేసి బాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని చెప్పుకొచ్చారు జోగి.
అయితే ఇన్నాళ్లు రాష్ట్రంలో ఏ వివాదం జరిగినా దాన్ని కాపు సామాజికవర్గానికి ఆపాదించి, అందుకు అదే సామాజికవర్గం నుంచి వచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్ టార్గెట్ గా రాజకీయం నడిపిన వైసీపీ కాపు ఓటర్లను కూటమికి దూరం చేసే ప్రయత్నం చేసింది.
అయితే ఆ కాపు రాజకీయాలు వైసీపీ ని రాజకీయంగా కాపు కాయవని తెలుసుకుని ఇప్పుడు వైసీపీ కొత్తగా బీసీ కుల రాజకీయాలను తెరమీదకు తెచ్చిందా.? అందుకోసం బీసీ ఐక్యత నినాదంతో బీసీ రణభేరి నిర్వహించనుందా.? నిన్నటి వరకు వైసీపీ కాపు లీడర్ గా గుర్తింపు పొందిన అంబటి స్థానంలో ఇప్పుడు బీసీ నేతగా జోగి కి చోటు దక్కనుందా.?






