కాన్సర్ బారిన పడి జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ కు యువరాజ్ సింగ్ ఎక్కడ దూరమవుతారోనని క్రికెట్ ప్రేమికులు కంగారుపడ్డ వైనం అందరికీ తెలిసిందే. టీమిండియా వరల్డ్ కప్ గెలవడానికి కారణమైన యువరాజ్ సింగ్ ఇటీవల కాలంలో ఒకటి, అర అవకాశాలు వస్తున్నా, మునుపటి మాదిరి తన ఆటతీరును కనపరచ లేకపోతున్నాడు. దీంతో యువీ ఆటతీరు చూసి ఆందోళన చెందడం అభిమానుల వంతయ్యింది. మళ్ళీ యువీ జట్టులోకి వస్తాడో, రాడో అనుకుంటున్న తరుణంలో… తాజాగా యువీ చేసిన ఒక ప్రకటన అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
“మళ్లీ తానూ టెస్ట్ మ్యాచ్ లు ఆడి తీరుతానని, ఖచ్చితంగా జట్టులో రాణిస్తానని” పూర్తి విశ్వాసాన్ని ప్రకటించాడు. అంతేకాదు, తదుపరి వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించడం తన ముందున్న మరో లక్ష్యంగా పేర్కొనడంతో యువీ గేమ్ పట్ల చాలా సీరియస్ గా ఉన్నాడని అర్ధమవుతోంది. వీలైనన్ని ఎక్కువ రోజులు క్రికెట్ ఆడిన తర్వాతే రిటైర్ అవుతానని, అప్పటి వరకు క్రికెట్లో మేటి ఆట కొనసాగించడానికి ప్రయత్నిస్తూనే ఉంటానని తన పట్టుదలను చాటుకున్నాడు.
ఇటీవల జరిగిన టీ 20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా మ్యాచ్లో గాయపడి, తదుపరి మ్యాచ్కు దూరం కావడం బాధ కలిగించిదని తెలిపాడు. 2019 వరల్డ్ కప్ లో ఆడితే చాలు అన్న యువీ కోసం క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తోంది. కళాత్మకమైన షాట్లను యువీ బ్యాట్ తో కొడుతుంటే… ముగ్ధులు కాని ప్రేక్షకులు ఉంటారా..! అందుకే యువీ ఎంట్రీ కోసం అభిమానులు వేయి కళ్ళతో వేచిచూస్తున్నారు.





