‘డార్లింగ్’ సినిమాలో హీరో ప్రభాస్ గురించి తండ్రి ప్రభు, హీరోయిన్ కాజల్ లు … సెకండాఫ్ లో ఒక డైలాగ్ చెప్తారు. “దమ్ము అనేది ప్రదర్శించేది కాదు… అవసరమైనపుడు అదే బయటకొస్తుంది…” అంటూ చెప్పిన డైలాగ్ సినిమాలో హీరోయిజాన్ని చూపిస్తుంది. అవసరమైన సమయంలో ప్రదర్శించేదే అసలైన దమ్ముగా చెప్పాల్సి వస్తే… క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇలాంటి ‘దమ్ము’ ఎన్నో సందర్భాలలో చూపించగా, తాజాగా చండీఘడ్ వేదికగా మరోసారి ప్రదర్శించారు.
పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుపై జరిగిన మ్యాచ్ లో 180 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. ఈ టోర్నీలో అద్భుతమైన ఫాంలో ఉన్న వార్నర్ మరోసారి 52 పరుగులు చేయగా, మరో ఓపెనర్ ధావన్ 25, వన్ డౌన్ హుడా 34 పరుగులు చేసారు. అయితే కీలకమైన చివరి ఓవర్లలో ఓవర్ కు 10పైగా పరుగులు చేయాల్సిన తరుణంలో మ్యాచ్ ఎటు వైపుకు మలుపు తిరుగుతుందా అన్న ఆసక్తి నెలకొనగా, యువరాజ్ సింగ్ మాత్రం మ్యాచ్ ను హైదరాబాద్ వైపుకు టర్న్ చేసాడు.
24 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 42 పరుగులు చేసి మ్యాచ్ ను విజయతీరాలకు చేర్చాడు. చివరి ఓవర్లో 8 పరుగులు చేయాల్సిన తరుణంలో మొదటి బంతినే సిక్స్ గా మలిచి ఎలాంటి ట్విస్ట్ కు తావివ్వకుండా మ్యాచ్ ను ముగించాడు. మరో ఎండ్ లో కట్టింగ్ కూడా 11 బంతుల్లో 18 పరుగులు చేసి యువీకి చక్కని తోడ్పాటు ఇచ్చాడు. యువీ చెలరేగడంతో హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ లో చేరినట్లయ్యింది. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ కు చేరిన మొదటి జట్టుగా కూడా హైదరాబాద్ 16 పాయింట్లను నమోదు చేసుకుని అగ్ర స్థానంలో నిలిచింది.





