రాజకీయ హామీల్లో భాగంగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ‘అమ్మ’ వెట్ గ్రైండర్స్ ను పంపిణీ చేసారు. అయితే అవి ప్రస్తుతం ఏపీలోని ఒంగోలు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో సందడి చేస్తున్నాయి. దాదాపు 3000 విలువైన ఈ టేబుల్ టాప్ వెట్ గ్రైండర్స్ ను కేవలం 1300 రూపాయలకే 2 సంవత్సరాల వారెంటీతో ఇవ్వడంతో స్థానిక మహిళలు ఎగబడి మరీ కొంటున్నారు.
చెన్నై నుండి లారీల ద్వారా పెద్ద మొత్తంలో ఈ గ్రైండర్లు ఏపీలోకి దిగుమతి అయినట్లు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రం కావడంతో బోర్డర్ లోకి ప్రవేశించడం తేలికగా మారింది. గతంలో ‘అమ్మ’ ప్రభుత్వం పంపిణీ చేసిన టెలివిజన్లు కూడా ప్రజలకు అందినవి కంటే, షాపుల్లో ప్రత్యక్షమైనవే ఎక్కువని ఆరోపణలు వచ్చాయి.
అయితే ప్రజాధనం ఇలా దుర్వినియోగం పాలవ్వడం పట్ల విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం రాష్ట్రాలకు బోర్డర్ లో ఉన్న వారికి ఇలాంటి అవకాశాలు రావడం సర్వసాధారణమేనని, ఇటీవల ‘చంద్రన్న సంక్రాంతి’ కానుకలు తమిళనాడులో ప్రత్యక్షమైన వైనం ఇందుకు నిదర్శనంగా చూపిస్తున్నారు.





