తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో సి.కల్యాణ్ నేతృత్వంలోని ‘మన ప్యానెల్’ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. అధ్యక్షుడిగా సి.కల్యాణ్ ముందుగానే ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన కీలక పదవులతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీలోనూ మన ప్యానెల్ అభ్యర్థులు సత్తా చాటారు.
అధ్యక్షుడిగా సి.కల్యాణ్ ఏకగ్రీవం
నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ట్రెజరర్గా మన ప్యానెల్ అభ్యర్థి చదలవాడ శ్రీనివాసరావు 383 ఓట్లతో విజయం సాధించారు.
వైస్ ప్రెసిడెంట్ పదవులకు మన ప్యానెల్ నుంచి మోహన్ వడ్లపట్ల 338 ఓట్లతో ఎన్నికయ్యారు. ప్రొగ్రెసివ్ ప్యానెల్ అభ్యర్థి కేఎల్ దామోదర్ ప్రసాద్ 274 ఓట్లతో మరో వైస్ ప్రెసిడెంట్ పదవిని దక్కించుకున్నారు.
జాయింట్ సెక్రటరీ పదవులు మన ప్యానెల్కే
రెండు జాయింట్ సెక్రటరీ పదవులను మన ప్యానెల్ గెలుచుకుంది. అమ్మిరాజు కానుమిల్లి 416 ఓట్లు సాధించగా, తుమ్మలపల్లి రామ సత్యనారాయణకు 398 ఓట్లు వచ్చాయి.
ఈసీలో మన ప్యానెల్ 12, ప్రొగ్రెసివ్ ప్యానెల్ 3
మొత్తం 15 ఎగ్జిక్యూటివ్ కమిటీ స్థానాల్లో మన ప్యానెల్ 12 సీట్లు గెలుచుకుంది. పద్మిని నాగులపల్లి 426 ఓట్లతో ఈసీ అభ్యర్థుల్లో అగ్రస్థానంలో నిలిచారు.
మన ప్యానెల్ నుంచి పద్మిని నాగులపల్లి, సునీల్ నారంగ్, జేవీ మోహన్ గౌడ్, శివలెంక కృష్ణప్రసాద్, డీవీవీ దానయ్య, వంశీ నందిపాటి, పల్లి కేశవరావు, వజ్జ శ్రీనివాసరావు, జే. పుల్లారావు, బాపిరాజు బల్లిపాడు, పి. రామకృష్ణ గౌడ్, ఎస్కే నయీమ్ అహ్మద్ ఈసీ సభ్యులుగా ఎన్నికయ్యారు.
ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి రవిశంకర్ యలమంచిలి (మైత్రీ రవి), డీఎస్ రావు, కే. నిరంజన్ రెడ్డి ఈసీ సభ్యులుగా గెలుపొందారు.
జనరల్ సెక్రటరీ పదవులకు సంబంధించిన ఎన్నికల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. దీంతో ఆ పదవులపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
మొత్తంగా అధ్యక్ష పదవితో పాటు ట్రెజరర్, ఒక వైస్ ప్రెసిడెంట్, రెండు జాయింట్ సెక్రటరీ పదవులు, 12 ఈసీ స్థానాలను గెలుచుకున్న మన ప్యానెల్ నిర్మాతల మండలి ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది.





