కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం “జనతా గ్యారేజ్” ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. “నాన్నకు ప్రేమతో” సినిమా విడుదల మరియు ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి కాగానే “జనతా గ్యారేజ్” సెట్స్ పైకి వెళ్లనుంది. 45 రోజుల పాటు ఏకధాటిగా జరగనున్న ఈ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో ఓ భారీ సెట్ ను నిర్మించబోతున్నారు.
మరో రెండు, మూడు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ సెట్ స్కెచ్ ను ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ అందించారు. సారధి స్టూడియోలో ఉన్న స్థలంలో ఎక్కువ శాతం ఈ సినిమా షూటింగ్ కే వినియోగించనున్నారు. “శ్రీమంతుడు” చిత్ర నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్, సి.వి.మోహన్ లు మైత్రీ మూవీస్ పతాకంపై “జనతా గ్యారేజ్”ను నిర్మించనున్నారు.
మలయాళ నటుడు మోహన్ లాల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో జూనియర్ సరసన సమంత నటిస్తుండగా, మరో కీలక పాత్రలో నిత్యామీనన్ కనువిందు చేయనుంది. ‘మిర్చి, శ్రీమంతుడు’ వంటి భారీ విజయాలను తమ ఖాతాలో వేసుకున్న కొరటాల – దేవిశ్రీప్రసాద్ కాంభినేషన్ ఈ సినిమాతోనూ రిపీట్ కానుంది.





