ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆఫీసులో 14 విస్కీ బాటిల్స్ కనిపించడం చూసి సీబీఐ షాక్ తింది. వీటిలో విదేశీ బ్రాండ్ల విస్కీ కూడా వుందని ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ పేర్కొంది. వీటిలో రెండు బాటిల్స్ బ్లూ లేబుల్, మూడు బ్లాక్ లేబుల్, ఐదు బాటిళ్ల చివస్ రీగల్, బ్లాక్ డాగ్, రెండు బాటిళ్ల ‘టీచర్స్’ వంటి వున్నాయని, ఢిల్లీ ఎక్సైజ్ చట్టం ప్రకారం ఎవరైనా 9 లీటర్ల మద్యం కన్నా ఎక్కువగా వుంచుకున్న పక్షంలో అది నేరమని సీబీఐ అధికారులు చెబుతున్నారు. అనుమతించిన దాని కన్నా ఇవి ఎక్కువగా వున్నాయని అధికారులు ఈ డైలీకి తెలిపాయి.
మరోవైపు తన కార్యాలయంలో జరిగిన సీబీఐ దాడులపై ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శిస్తూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల మీద బీజేపీ మండిపడింది. ఆయనకు మోదీ ఫోబియో పట్టుకుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు దుయ్యబట్టారు. కేజ్రీవాల్ హిపోక్రసీ బట్టబయలైందని ఆయన విమర్శించారు. అవినీతికి పాల్పడే అధికారి ఇంటిపై గానీ, కార్యాలయంపై గానీ సీబీఐ దాడులు జరిపితే అందుకు ముందుగా తమ ప్రభుత్వం నుంచి అనుమతి అవసరం లేదని కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ గతంలో చేసిన తీర్మానాన్ని మంత్రి వెంకయ్య గుర్తుచేశారు. మరో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కూడా కేజ్రీవాల్ కామెంట్స్ను రబ్బిష్గా కొట్టి పారేశారు.
ఇదిలా వుండగా ఢిల్లీ చీఫ్ సెక్రటరీ రాజేంద్రకుమార్కు సంబంధించి ఢిల్లీ, యూపీలోని ఆయన కార్యాలయాలు, బంధువుల ఇళ్లు.. ఇలా మొత్తం 14 చోట్ల సీబీఐ సోదాలు జరిపింది. 2.4 లక్షల నగదు సహా రూ. 16 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కుమార్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్ములో 3 లక్షల విలువైన విదేశీ కరెన్సీ కూడా వుంది. 2007-14 మధ్య అధికార దుర్వినియోగంతో రాజేంద్రకుమార్ ఢిల్లీ ప్రభుత్వ విభాగాల నుంచి రూ. 9.5 కోట్ల విలువైన 5 కాంట్రాక్టుల టెండర్లను తనకు అనుకూలమైన ‘ఎండీవర్ సిస్టమ్’ అనే సంస్థకు దక్కేలా చూశారాన్నది ప్రధాన ఆరోపణ. దీంతో ఆయనపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.





