ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనంగా రికార్డులకెక్కిన దుబాయ్ లోని “బూర్జ్ ఖలీఫా” కొత్త సంవత్సరం వేడుకల్లో మంటల్లో చిక్కుకుంది. 4 లక్షల ఎల్.ఈ.డీ లైట్లు మరియు 1.6 టన్నుల ఫైర్ వర్క్స్ తో నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో ఒక్కసారిగా బిల్డింగ్ లో మంటలు వ్యాప్తి చెందాయి. అయితే ఇదంతా ‘బూర్జ్ ఖలీఫా’ దగ్గరగా ఉన్నటువంటి ‘డౌన్ టౌన్’ హోటల్ లో సంభవించిన ఘటన.
‘బూర్జ్ ఖలీఫా’కు దగ్గరగా మంటలు వ్యాప్తి చెందడంతో ప్రపంచపు ఎత్తైన టవర్ మంటల్లో చిక్కుకుందని సోషల్ మీడియా వేదికగా క్షణాల్లో సమాచారం విశ్వవ్యాప్తంగా పాకిపోయింది. అయితే జరిగింది తెలుసుని అంతా అవాక్కయ్యారు. 2016లో ఫస్ట్ ట్విస్ట్ అదిరిపోయిందంటూ నెటిజన్లు సందడి చేస్తున్నారు. అసలు జరిగింది ఏమిటంటే…
‘బూర్జ్ ఖలీఫా’ వద్ద జరగబోయే వేడుకలను వీక్షించడానికి దాదాపు 10 లక్షల మంది చేరుకున్న సమయంలో 63 ఫ్లోర్ల ‘డౌన్ టౌన్’ హోటల్ లో మంటలు చెలరేగాయి. దీనిపై దుబాయ్ పోలీసులు ఓ అధికారిక ప్రకటన చేసారు. మంటల్లో చిక్కుకుంది ‘బూర్జ్ ఖలీఫా’ కాదని, ‘డౌన్ టౌన్’ హోటల్ లో అని, దాదాపు 14 మంది గాయాల బారిన పడ్డారని, మంటల్లో చిక్కుకున్న ఒకరు మాత్రం పొగ కారణంగా గుండె పోటుతో ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు. ఈ ఘటనలో పిల్లలెవరూ ఇరుక్కోలేదని తెలిపారు.







