గత ఎన్నికలలో మంగళగిరి ఎమ్మెల్యే గెలుపొందిన వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ రెడ్డి గెలిచిన తరువాత స్థానిక నియోజకవర్గ ప్రజలకు చేసిందేమిటి అనే ప్రశ్నకు ఆయనిచ్చిన సమాధానాలను టీడీపీ నేత నారా లోకేష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
ఈ వీడియో ను చూస్తున్న వారంతా ఇందుకేనా ఈయనకు కరకట్ట కమలహాసన్ అనే బిరుదు వచ్చింది అంటూ వీడియో ను వైరల్ చేస్తున్నారు. లోకేష్ మీద పోటీకి నిలబడిన ఆర్కే ను గెలిపిస్తే మంత్రిని చేస్తా అంటూ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు జగన్ ఇచ్చిన హామీ గడిచిన ఐదేళ్లలో ఏ మేరకు నిలబెట్టుకున్నారో రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిన విషయమే.
మా ప్రాంతం నుండి గెలిచిన అభ్యర్థి మంత్రి అయితే స్థానిక సమస్యలు త్వరిత గతిన పరిష్కారం అవుతాయని ఆశపడిన ప్రజలకు దక్కిందేమిటో స్థానిక ప్రజలకే తెలుసు. ఇటువంటి తరుణంలో అనూహ్యంగా వైసీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైస్సార్ మరో బిడ్డ షర్మిల వెంట నడవడానికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
అయితే ఆర్కే ఎవరి ఒత్తిడ్లకు లొంగారో..? ఎవరి బుజ్జగింపులు తగ్గారో…? ఎవరి బెదిరింపులకు వెనకడుగు వేసారో కానీ తిరిగి వైసీపీ ఫ్యాన్ కిందకే చేరారు. అయితే పార్టీ మారిన ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి జగన్ మీద ఆర్కే చేసిన కామెంట్స్ ను స్థానిక ఎమ్మెల్యే గా గెలుపొందిన ఆర్కే మంగళగిరికి చేసిందేమిటో తెలుసుకోండి అంటూ లోకేష్ ఇప్పుడు పోస్టు చేసారు.
ముఖ్యమంత్రి జగన్ మంగళగిరి అభివృద్ధికి 1200 కోట్ల రూపాయిలు కేటాయిస్తున్నాం అని చెపుతూ…రాష్ట్రంలో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంత పెద్ద మొత్తంలో నిధుల విడుదల సాధ్యం కాదు అంటూ దాన్ని 5 వందల కోట్లకు కుదించడం…అక్కడి నుంచి దాన్ని 350 కోట్లకు తగ్గించి చివరికి 125 కోట్లకు పరిమితం చేసారు. కనీసం ఆ కేటాయించిన నిధులు కూడా విడుదల చేయలేదు అంటూ ఆర్కే మాట్లాడిన మాటలను మరో సారి స్థానిక ప్రజలకు గుర్తుచేశారు లోకేష్.
అధికారంలో ఉండి కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా వారికి ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేక పోయాం.పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు, నవులూరు ప్రాంతాలకు వెళ్లాలంటే ఏ ముఖం పెట్టుకొని వెళ్లాలో తెలియడం లేదు. సంక్షేమం తో పాటు అభివృద్ధి కూడా చేయాల్సిన బాధ్యత అధికార పార్టీ పై ఉంటుంది.
కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా జరగడం లేదు అంటూ ఎమ్మెల్యే గా ఉండి ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయాను అంటూ ఒక పక్క…నేను చేసిన అభివృద్ధి చూడాలంటే లెక్కలు సరిపోవు అంటూ మరోపక్క…భిన్న ప్రకటనలు చేయడంతో నీలో మస్తు షేడ్స్ ఉన్నాయిగా అంటూ ఆర్కే మీద కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అలాగే ఇంతకీ ఆర్కే హయాంలో వైసీపీ ప్రభుత్వంలో మంగళగిరిలో అభివృద్ధి జరిగినట్టా…లేదా..?క్లారిటీ ఇవ్వండి కమలహాసన్ అంటూ కౌంటర్లు వేస్తున్నారు.




