టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ముఖ్య నేతలపై ఏదో ఓ కేసులో లోపల వేయాలని జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలెవీ ఫలించకపోవడంతో, చివరి ప్రయత్నంగా వైసీపి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి చేత సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేయించిన్నట్లు అనుమానించక తప్పదు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడుని నిందితుడుగా చేర్చి సీబీఐ చేత విచారణ జరిపించాలని ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూలై24కి వాయిదా వేసింది.
ఈ సందర్భంగా ఆళ్ళ రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఏడేళ్ళుగా ఈ కేసు నుంచి తప్పించుకున్నారు. కానీ ఇకపై సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళక తప్పదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాక తప్పదు,” అని అన్నారు.
ఆళ్ళ మాటలనే అక్రమాస్తుల కేసులకు, వివేకా హత్య కేసుకి కూడా అన్వయించి చూస్తే, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డిలకి ఎవరూ సాటి రారని అర్దమవుతుంది.
అక్రమస్తుల కేసులో బెయిల్ పొందిన జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్ళ పూర్తికాలం అధికారంలో కూడా ఉన్నారు. ఇవే కేసులో ఏ-2గా ఉన్న వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభ ఛైర్మన్ హోదాలో రాజ్యసభని నడిపించారు కూడా.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడని సీబీఐ కోర్టులో చాలా స్పష్టంగా చెపుతోంది. కానీ ఆయనను అరెస్ట్ చేయలేకపోతోంది.
మండపేట వైసీపి అభ్యర్ధి తోట త్రిమూర్తులు అయితే వీరిద్దరి రికార్డులు బద్దలు కొట్టేసి శిరోముండనం కేసుని ఏకంగా 28 ఏళ్ళు అదీ… జిల్లా కోర్టులోనే నడిపించేశారు. ఏళ్ళ తరబడి సాగుతున్న ఈ రెండు కేసులను గమనిస్తే, వ్యవస్థలను ఎవరు గొప్పగా మేనేజ్ చేస్తున్నారో అర్దమవుతుంది.
కానీ గురివింద గింజ తన నలుపు ఎరుగదన్నట్లు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఓటుకి నోటు కేసు గురించి మాట్లాడుతున్నారు. జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని ఏమీ చేయలేకనే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి చేత చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేయించిన్నట్లు అనుమానించక తప్పదు.




